తెలంగాణాలో ముందస్తు ఎన్నికలకు తెరలేచిన నేపథ్యంలో అక్కడి అధికార, విపక్ష పార్టీలు అధికారంలోకి వచ్చేందు కు అవసరమైన అన్ని మార్గాలను వినియోగించుకుంటున్నాయి. సాధారణంగా ఎవరైనా అధికారంలోకి వచ్చేందుకు ఉన్న మార్గాలను ప్రతి ఒక్కటీ వినియోగించుకుంటారు. ఇక, తెలంగాణాలో రెండు రకాల పరిస్థితులు ఉన్నాయి. ఒకటి అక్కడి ప్రజలను బుజ్జగించడం, అదేసమయంలో ఏపీ సరిహద్దు జిల్లాల్లో ఉన్న ఏపీకి చెందిన వారిని, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని ఏపీ ప్రజలను బుజ్జగించాల్సిన అవసరం చాలా ఉంది. ఈ క్రమంలో పార్టీలు ఇప్పటికే వ్యూహాత్మ కంగా ముందుకు వెళ్తున్నాయి.
ముఖ్యంగా తిరిగి అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతున్న టీఆర్ ఎస్ నేతలు.. ఏపీ ప్రజల ఓటు బ్యాంకు కోసం చేస్తున్న ప్రకటనలు విస్మయానికి గురి చేస్తున్నాయి. టీఆర్ ఎస్ కీలక నాయకుడు, కేసీఆర్ కుమారుడు తాజాగా చేసిన ప్రకటన ఏపీ ప్రజలకు ఏ మేరకు బిస్కెట్ వేస్తున్నా రనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. తెలంగాణాలో ఉండే రాయలసీమ, కోస్తాంధ్ర ప్రజలందరూ తనను సోదరుడిగా భా వించాలని, అందరికీ వ్యక్తిగతంగా అండగా ఉంటానని కేసీఆర్ కుమారుడిగా, టీఆర్ఎస్ నాయకుడిగా హామీ ఇస్తు న్నా నని కేటీఆర్ చెప్పుకొచ్చారు. అంతేకాదు, పొరపాటున మీ మనసులో ఏమైనా అనుమానాలుంటే వాటిని పక్కకు పెట్టండి అని అభ్యర్థించాడు.
గత కొద్ది రోజులుగా కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు సీమాంధ్రులను ఉద్దేశించి కాదని, ఆయన విమర్శించింది చంద్రబాబునేనని స్పష్టం చేశారు. చంద్రబాబుతో టీఆర్ఎస్కు అభ్యంతరాలు ఉన్నమాట వాస్తవమేనని, వాటిని ప్రజలు తమకు ఆపాదించుకోవద్దని అన్నారు. ‘హమారా హైదరాబాద్’ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. అయితే, ఈసందర్భంగానే కేటీఆర్ చాలా ఆశ్చర్యకరమైన విషయాన్ని చెప్పుకొచ్చారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన సమయంలో తెలంగాణ తరఫున రూ.100 కోట్లు సాయం ప్రకటించాలని సీఎం కేసీఆర్ భావించారని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. శంకుస్థాపనకు మోడీతోపాటు కేసీఆర్నూ ఏపీ సర్కారు ఆహ్వానించింది.
శంకుస్థాపనకు వెళ్లాలా వద్దా అని చర్చ జరిగినప్పుడు మెజారిటీ సభ్యులు వెళ్లాలని చెప్పారు. కేంద్రం ఏం ఇస్తోందో తెలుసుకునేందుకు ప్రధాని కార్యదర్శిని సంప్రదించగా.. మట్టి, నీళ్లేనని జవాబు వచ్చింది. మోడీని అగౌరవ పరచినట్లు ఉంటుందని భావించి సాయం చేయాలన్న నిర్ణయాన్ని కేసీఆర్ విరమించుకున్నారు అని కేటీఆర్ తెలిపారు! అయితే, కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల వ్యూహంలో భాగంగానే ఇక్కడ కేటీఆర్ ఇలా వ్యాఖ్యానిస్తున్నారని, రైతులకు రుణాలు మాఫీ చేయలేని ప్రభుత్వం.. ఏపీకి వంద కోట్లు ఇస్తానంటే.. ఎవరైనా నమ్ముతరా? అని ప్రశ్నిస్తున్నారు. అయితే, దీనికి సమాధానం చెప్పేవారు లేకపోవడం గమనార్హం.