అవును, చంద్రబాబునాయుడు ప్రభుత్వంపై కేంద్రప్రభుత్వం నిఘా వేసినట్లు బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు పెద్ద బాంబే పేల్చారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, అభివృద్ధి పేరుతో అప్పులు చేయటంలోనే పెద్ద కుంభకోణమని ఆరోపించారు. అందుకే చేసిన అభివృద్ధిపై లెక్కలు చెప్పటానికి చంద్రబాబు భయపడుతున్నట్లు ఎద్దేవా చేశారు. పైగా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తు కేంద్రంపై ధర్మపోరాటాల పేరుతో చంద్రబాబు దొంగనాటకాలాడుతున్నట్లు మండిపడ్డారు.
అవినీతిలోనే మొదటి స్ధానం
అమరావతిలో వెయ్యి ఖర్చయ్యే చోట ప్రభుత్వం పదివేల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిధులను పార్టీ ఫండ్ గా తరలిస్తున్నారనే అనుమానాలు కూడా తమకున్నట్లు జివిఎల్ చెప్పారు. అభివృద్ధిలో లాస్ట్ లోను అవినీతిలో మాత్రం మొదటిస్ధానంలో ఉన్నట్లు చంద్రబాబు ప్రభుత్వాన్ని దుమ్ముదులిపేశారు. స్వప్రయోజనాల కోసం ప్రజాధానాన్ని దుర్వినియోగం చేయటంలో చంద్రబాబుకు మించిన వారు లేరంటూ మండిపడ్డారు.
లెక్కలెందుకు చెప్పటం లేదు ?
చంద్రబాబు చేస్తున్న ఖర్చులపై అనుమానంతోనే కేంద్రం మంజూరు చేసిన నిధుల వినియోగంపై లెక్కలు అడుగుతోందని స్పష్టం చేశారు. కేంద్రం నిధులకు లెక్కలడుగుతుంటే అందచేయటానికి చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారంటూ నిలదీశారు. అభివృద్ధి కోసం అప్పులు చేయటం తప్పు కాకపోయినా ఏపిలో మాత్ర తెచ్చిన నిధులు సక్రమంగా ఉపయోగపడటం లేదని అభిప్రాయపడ్డారు.అందుకే చంద్రబాబు ప్రభుత్వం చేసే ప్రతీ పనిపైనా జాతీయ స్ధాయిలో నిఘా ఉంటుందని కుండబద్దలు కొట్టినట్లు స్పష్టంగా చెప్పారు.