ప్రత్యేకహోదా కోసం తాజాగా మరో యువకుడు బలిదానం చేసుకున్నాడు. హోదా కోసం బలిదానం లేదా ఆత్మహత్య చేసుకోవటం వల్ల ఎటువంటి ఉపయోగం లేకపోయినా యువత క్షణివేశంతో ప్రణాలు తీసుకుంటున్నారు. ఈరోజు ఉదయం మదనపల్లికి చెందిన యువకుడు సుధాకర్ ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తన మరణానికి ఎవరూ కారణం కాదని కేవలం ప్రత్యేకహోదా మన హక్కు అంటూ ఓ నోట్ రాసి ఉరేసుకోవటం గమనార్హం.
ఇదే మొదటి బలిదానం కాదు
హోదా కోసం బలిదానం ఇదే మొదటిది కాదు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో నలుగురు మరణించారు. తిరుపతిలో మునికోటి, నూజివీడులో శ్రీనివాస్ కూడా తమ ప్రాణాలను త్యాగం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. మొన్ననే రాష్ట్ర బంద్ సందర్భంగా పోలీసులు జరిపిన లాఠీచార్జి జరిగింది. ఆ సందర్భంగా పోలీసుల చేతిలో దెబ్బలు తిన్న వాళ్ళని అరెస్టు చేశారు. ఆ సందర్భంగా దుర్గారావు అనే వ్యక్తికి గుండెపోటు వచ్చి మరణించారు.
బంద్ లో 13 వేల మంది అరెస్టులా ?
ప్రత్యేకహోదా కోసం మొన్నటి బంద్ లో వైసిపికి చెందిన నేతలు, శ్రేణులు అంతా కలిపి సుమారు 13 వేల మందిని పోలీసులు అరెస్టులు చేశారు. ఒక కారణంతో లేదా సెంటిమెంటుతో అన్ని వేల మంది అరెస్టులవ్వటం బహుశా రాష్ట్ర చరిత్రలో అదే ప్రధమం. మరి అంతటి సెంటిమెంటు ఎక్కువుగా ఉన్నపుడు కేంద్రప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించాల్సుంటుంది. వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా బలిదానాలు, ఆత్మహత్యలు వద్దని పదే పదే మొత్తుకుంటున్నారు. బలిదానాలతో ఉపయోగం లేదని పోరాడి సాధించుకుందామని నేతలు చెబుతున్నా కొందరు మాత్రం ఆత్మహత్యలకు పాల్డడటం నిజంగా బాధాకరమే.