నరేంద్రమోడి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం సందర్భంగా కొందరు ఎంపిలు చంద్రబాబునాయుడుకు పెద్ద షాక్ ఇచ్చారా ? పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వస్తోంది. అదికూడా తెలుగుదేశంపార్టీ ఎంపిలే ఊహించని విధంగా చంద్రబాబుకు హ్యాండ్ ఇచ్చారనే విషయమై పార్టీలో అంతర్గతంగా బాగా జోరుగా చర్చ జరుగుతోంది. దాంతో పెద్ద షాక్ కు గురైన చంద్రబాబు పరిస్ధితిపై సమీక్షించి సర్దుబాబు చేసేందుకు వెంటనే ఢిల్లీకి వెళ్ళినట్లు పార్టీ నేతలు చెప్పారు.
ఎన్డీఏకి వచ్చింది 325 ఓట్లు
ఇంతకీ విషయం ఏమిటంటే, అవిశ్వాస తీర్మానం సందర్భంగా చర్చ తర్వాత ఓటింగ్ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. మొత్తం ఓట్లలో అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా అంటే ఎన్డీఏకి అనుకూలంగా 325 ఓట్లు వచ్చాయి. ఇక, చంద్రబాబు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా అంటే మోడి సర్కార్ కు వ్యతిరేకంగా 126 ఓట్లు వచ్చాయి. ఓటింగ్ జరిగితే అవిశ్వాస తీర్మానం వీగిపోతుందని అందరికీ తెలుసనుకోండి అది వేరే సంగతి.
11 ఓట్లు అదనంగా వచ్చాయట
ఓటింగ్ తర్వాత స్పీకర్ ఏ పక్షానికి ఎన్ని ఓట్లు వచ్చింది ప్రకటించారు. అయితే ఇక్కడే అసలు మతలబు బయటపడిందట. ఎలాగంటే, నిజానికి ఎన్డీఏకి అనుకూలంగా వచ్చిన ఓట్లు 325. నిజానికి ఎన్డీఏలోని ఓట్లు ప్లస్ మరికొన్ని తటస్ధులవి కలుపుకుని ఎన్డీఏకి వస్తాయనుకున్న ఓట్లు 314 మాత్రమే. కానీ వచ్చినవి 325 ఓట్లు. అంటే అంచనా వేసిన ఓట్లకన్నా 11 ఓట్లు ఎక్కువగా వచ్చాయి. అదనంగా వచ్చిన 11 ఓట్లు ఎవరేశారు ? ఇపుడదే హాట్ టాపిక్ గా మారింది.
టిడిపి నుండి 6 ఓట్లు క్రాస్ అయ్యాయా ?
ఓటింగ్ ప్రకటించిన తర్వాత మోడి వ్యతిరేక పార్టీల్లో అదే రోజు రాత్రి అంతర్గతంగా ఓటింగ్ విషయమై సమీక్షలు జరిగాయట. అన్నీ లెక్కలు వేసుకున్న తర్వాత తేలిందేమిటంటే టిడిపి నుండి 6 ఓట్లు ఎన్డీఏకి అనుకూలంగా క్రాస్ అయినట్లు గుర్తించారట. దాంతో టిడిపి నేతలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఒకటికి రెండు సార్లు అదే విషయాన్ని ఎంపిల్లోని కొందరు చర్చించుకుని తమ నుండి క్రాస్ ఓటింగ్ నిజమే అని నిర్ధారించుకున్నారట. వెంటనే అదే విషయాన్ని అప్పటికప్పుడు చంద్రబాబుతో చెప్పారట. దాంతో చంద్రబాబు ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు ఫీలయ్యారట.
ఇంతకీ ఆ 6 ఓట్లు ఎవరివి ?
చంద్రబాబుతో మాట్లాడినపుడు ఎవరెవరు ఎన్డీఏకు అనుకూలంగా ఓట్లు వేశారో కూడా సదరు ఎంపిలు అధినేత చెవిన వేశారట. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం రాయలసీమకు చెందిన ఇద్దరు ఎంపిలు, ఉత్తరాంధ్రకు చెందిన ఓ ఎంపి, ముగ్గురు ఫిరాయింపు ఎంపిల్లో ఇద్దరు. కోస్తా జిల్లాల్లోని ఒక ఎంపి ఎన్డీఏకి అనుకూలంగా ఓట్లు వేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎప్పుడైతే క్రాస్ ఓటింగ్ విషయం బయటపడిందో చంద్రబాబులో టెన్షన్ పీక్ స్టేజ్ కి చేరుకుందట. అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించిన తమ పార్టీ నుండి క్రాస్ ఓటింగ్ జరగటాన్ని టిడిపి నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. లోక్ సభలో ముగిసిన అవిశ్వాస తీర్మాన ఘట్టం సోమవారం రాజ్యసభలో మొదలవనున్నది. దాంతో ఎంపిలందరితో మాట్లాడి పరిస్ధితిని సర్దుబాటు చేసేందుకు చంద్రబాబు వెంటనే ఢిల్లీకి వెళ్ళారట. మరి, రాజ్యసభలో ఏం జరుగుతుందో ఏమో చూడాల్సిందే.