అమరావతి : ఇందుకేనా ప్యాకేజీస్టార్ అనే ముద్రపడింది ?

Vijaya




దత్తపుత్రుడని, ప్యాకేజీ స్టారని, చంద్రబాబునాయుడు ప్రయోజనాలను కాపాడేందుకు ఉన్నారంటు మంత్రులు, వైసీపీ నేతలు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను పదేపదే టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే. తనను ప్యాకేజీ స్టార్ అన్నవాళ్ళని చెప్పుతో కొడతానని పవన్ వార్నింగ్ ఇచ్చినా మంత్రులు అవే ఆరోపణలు చేస్తున్నారు. కాసేపు మంత్రుల ఆరోపణలను పక్కనపెట్టేస్తే పవన్ వ్యవహారశైలి సరిగ్గా ఆరోపణలకు తగ్గట్లే ఉంది.



తాజా ఉదాహరణ చూస్తే మంత్రుల ఆరోపణలు నిజమేనేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. విషయం ఏమిటంటే చంద్రబాబు నెల్లూరు జిల్లా కందుకూరు బహిరంగసభ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 8 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఘటనకు చంద్రబాబే బాధ్యత వహించాలంటు మంత్రులు గట్టిగా తగులుకున్నారు. వీళ్ళే కాకుండా ఘటనకు బాధ్యునిగా స్ధానికులు కూడా చంద్రబాబునే తప్పుపడుతున్నారు. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ప్రచారపిచ్చి వల్లే 8మంది చనిపోయారంటు దుమ్మెత్తిపోస్తున్నారు.



బుధవారం రాత్రి అంతపెద్ద ఘటన జరిగితే గురువారం తెల్లవారి వరకు  పవన్ స్పందించనే లేదు. అప్పుడు కూడా మొక్కుబడిగా నాలుగులైన్ల ప్రెస్ నోట్ విడుదలచేశారు. అందులో ఏముందంటే టీడీపీ సభలో ఇలాంటి ఘటన జరగటం బాధాకరం, కార్యకర్తలే ఏ పార్టీకైనా వెన్నుదన్ను, అలాంటి కార్యకర్తలు చనిపోవటం చాలా దురదృష్టం, చనిపోయిన వారి ఆత్మలకు శాంతి కలగాలి, బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి అనుందంతే.



ఇలాంటి ఘటనే జగన్మోహన్ రెడ్డి లేదా వైసీపీ  కార్యక్రమంలో జరిగుంటే అప్పుడు పవన్ స్పందన ఇలాగే ఉండేదా ?   రాష్ట్రంలో ఎక్కడ ఏ ఘటన జరిగినా జగన్ కు వ్యతిరేకంగా ఎంతలా రెచ్చిపోతున్నారో అందరు చూస్తున్నదే. ఇద్దరి వ్యక్తిగత గొడవలు, కుటుంబకలహాల విషయంలో ఎవరైనా చనిపోతే  దాన్నికూడా జగన్ ప్రభుత్వానికి ముడిపెట్టేసి నానా రచ్చ చేస్తున్నారు. అలాంటిది ఇంతమంది చనిపోతే చంద్రబాబును తప్పుపట్టడానికి పవన్ కు మనసొప్పలేదు. అసలా ప్రెస్ నోట్లో చంద్రబాబు పేరుకూడా ప్రస్తావించలేదు. ఘటనకు బాధ్యుడిగా చంద్రబాబును పవన్ నిలదీసుంటే వ్యవహారం మరోలాగుండేది. కానీ ఆపని చేయలేదు కాబట్టే మంత్రులు పవన్ను ప్యాకేజీస్టార్ అని అంటున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: