అమరావతి : బీజేపీ నెత్తిన మోడీయే బండేస్తున్నారా ?

Vijaya






సొంతపార్టీ నెత్తినే ఎవరైనా బండలు వేసుకుంటారా ? నరేంద్రమోడీ ఇపుడు అదేపని చేస్తున్నారు. కాకపోతే దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లో కాదు ఏపీలో మాత్రమే. 2014లో ప్రధానమంత్రి అయినదగ్గర నుండి మోడీ ఏపీ ప్రయోజనాలను తుంగలో తొక్కుతునే ఉన్నారు. అప్పట్లో ఎన్నికల సమయంలో చెప్పినదానికి ప్రధాని అయినతర్వాత నుండి పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఒకసారి, రెండుసార్లు కూడా ప్రతిసారి, ప్రతి విషయంలోను ఏపీని దెబ్బ కొడుతునే ఉన్నారు.



మొదట ప్రత్యేకహోదాను అటకెక్కించేశారు. తర్వాత విశాఖపట్నం కేంద్రంగా రైల్వేజోన్ అంశాన్ని దెబ్బతీశారు. ఆ తర్వాత వెనుకబడిన జిల్లాలకు అభివృద్ధి నిధులను నిలిపేశారు. పోలవరం ప్రాజెక్టు వ్యయంలో కూడా పూర్తిగా కోతపెట్టేశారు. తర్వాత వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేసేస్తున్నారు. ఇలా ఏ రూపంలో తీసుకున్నా ఏపీని మోడీ ప్రభుత్వం దెబ్బకొడుతునే ఉంది. మామూలుగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా జనాలకు కావాల్సింది చేసి నమ్మకం సంపాదించుకుని ఎన్నికల్లో లబ్దిపొందాలని చూస్తుంది.



కానీ మోడీ సర్కార్ మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. కారణం ఏమిటంటే ఏపీకి ఎంతచేసినా ఎలాంటి ఉపయోగం ఉండదని అర్ధమైపోయుంటుంది. రాష్ట్రప్రయోజనాలను కాపాడినా, తుంగలో తొక్కినా ఫలితంలో ఎలాంటి తేడా ఉండదని నిర్ధారణకు వచ్చేసినట్లుంది. అందుకనే లోకల్ నేతలు ఎన్నిమాటలు మాట్లాడినా ఢిల్లీలో నాయకత్వం ఏమనుకుంటే అదే జరుగుతోంది. లోకల్ గా తాము చెబుతున్నదనికి ఢిల్లీలో జరుగుతున్నదానికి పూర్తి విరుద్ధంగా ఉండటంతో వీళ్ళు కూడా ఏమీ మాట్లాడలేకపోతున్నారు.




మోడీ సర్కార్ వైఖరి చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో కూడా రాష్ట్రంలో  బీజేపీకి డిపాజిట్లు దక్కేది అనుమానంగానే ఉంది. ఒకవైపు రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం కుళ్ళబొడుస్తుంటే స్ధానిక నాయకత్వం ఏమిచెప్పి జనాలను ఎన్నికల్లో ఓట్లడుగుతుంది ? ఇదే సమస్య వైసీపీ, టీడీపీ, జనసేనకు కూడా ఉన్నప్పటికీ కేంద్రంలో ఎన్డీయేకి నాయకత్వం వహిస్తున్నది బీజేపీనే కాబట్టి ఆ పార్టీకే ఎక్కువ సమస్య. మొత్తానికి బీజేపీపైన మోడీయే పెద్ద బండలేస్తున్న విషయం అర్ధమైపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: