దూసుకుపోతున్న ' తెల్ల బంగారం'..ఆ మార్కెట్ లో రికార్డు..
పత్తికి కేంద్ర ప్రభుత్వ కనీస మద్ధతు ధర క్వింటాలుకు 6,025 రూపాయల కన్నా రెండు రెట్లు ఎక్కువ పలుకుతుండటం గమనార్హం. తాజాగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో క్వింటాల్ పత్తి ధర 13వేల రూపాయలు పలికింది. మార్కెట్ చరిత్రలో గతంలో ఎప్పుడూ లేని విధంగా పత్తి ధరలు పెరగడంతో రైతులు సంతోషం తో సంబరాలు జరుపుకుంటున్నారు. గత ఏడాది ఒకవైపు వర్షాలు, మరో వైపు కాయ తొలుచు పురుగు వల్ల ఆశాజనకంగా పంట దిగుబడి రాలేదు. వచ్చిన నాలుగు, ఐదు క్వింటాలు కూడా 4 వేలు, 5 వేలు వరకే పలికింది.
కనీసం పెట్టుబడి కూడా రాలేదు. కానీ, ఈ ఏడాది ఎకరాకు నాలుగు నుంచి ఐదు క్వింటాల పత్తి దిగుబడి వచ్చింది. క్వింటాల్కు గరిష్టంగా 13 వేల రూపాయలు, మాడల్ ధర 10,200, కనిష్ట ధర 8,500 పలికింది. కేవలం జమ్మికుంటలోనే కాదు, ఖమ్మం జిల్లాతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మార్కెట్ చరిత్రలో ఎన్నడూ లేనంతగా ధర పలికుతోంది. అటు ఏపీలోనూ పత్తికి ఆల్ టైం రికార్డ్ ధరలు వస్తున్నాయి. ఈ ఏడాది పత్తిసాగు తగ్గడం, దిగుబడి తగ్గడంతో పత్తికి డిమాండ్ పేరుగుతోందని పత్తి వ్యావారులు అంటున్నారు.జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి విపరీతంగా డిమాండ్ ఉంది.. వాతావరణం అనుకూలించక పత్తి పంట వేయడానికి రైతులు ఆసక్తి చూపించలేదు.