కేంద్రానికి ఎందుకింత వివక్ష...!
రిపబ్లిక్ డే సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించే పరేడ్లో అన్ని రాష్ట్రాల శకటాలను ప్రదర్శిస్తారు. దేశానికి స్వాతంత్ర్య వచ్చి 75 ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా ఈ ఏడాది వేడుకలను మరింత అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఇందుకోసం స్వాతంత్ర్య స్ఫూర్తికి అద్దం పట్టేలా శకటాలను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కూడా అందుకు తగినట్లుగానే శకటాలను రూపొందించాయి. ఏపీ ప్రభుత్వం జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్యపై శకటాన్ని రూపొందించిది. దీనిని కూడా ఇప్పుడు కేంద్రం తిరస్కరించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్ట్రాలు తయారు చేసిన శకటాలను కూడా కేంద్రం తిరస్కరించింది. నేతాజీ 125వ జయంతిని పురస్కరించుకుని బెంగాల్ రాష్ట్రం ప్రత్యేక శకటం తయారు చేసింది. అలాగే తమిళనాడుకు రాష్ట్రానికి చెందిన తొలి స్వతంత్ర సమరయోధురాలు వేలునాచయ్యర్ స్ఫూర్తితో రూపొందించిన శకటాన్ని నాలుగు సార్లు పరీక్షించిన తర్వాత... తిరస్కరించడంపై ప్రధాని నరేంద్రమోదీకి లేఖ కూడా రాశారు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్. ఎందుకీ వివక్ష అంటూ నిలదీశారు. దీంతో ఇప్పుడు శకటాల గొడవ పెద్ద దుమారం రేపుతోంది.