జగనన్న : ఆ ఇంటి గొడవ ఆంధ్రజ్యోతికే ఎరుక!
ఈ తరుణంలో ఈ నేపథ్యంలో....
ఆంధ్రావని రాజకీయాలవైపు షర్మిల మొగ్గు చూపుతున్నారని ఏబీఎన్ రాధాకృష్ణ జోస్యం చెబుతున్నారు. అన్నతో ఉన్న విభేదాల కారణంగా ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారని కూడా నిన్న వీకెండ్ కామెంట్ లో చెప్పారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో సత్తా చాటేందుకు షర్మిల తనదైన పోరు సాగిస్తారని కూడా అన్నారు. ఇందుకు అనేక కారణాలు చూపుతూ ఆయన తన కథనాన్ని వండి వార్చారు. వాస్తవానికి షర్మిలకు కొంత కాలంగా ఏబీఎన్ ఆంధ్ర జ్యోతి ఛానెల్ మద్దతు ఇస్తూ వస్తోంది. ఆమె ఓ సారి ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమానికి కూడా విచ్చేసి చాలా విషయాలు చెప్పారు. అయితే ఇప్పుడు ఆర్కే ప్రేమ వైసీపీ విభేదాలపై ఎందుకో చూద్దాం.
ఆ వివరంలో వాస్తవం ఎంత?
మొన్నటి క్రిస్మస్ ముందు రోజున ఇడుపులపాయ గెస్ట్ హౌస్ లో వివాదాలు రేగాయి అని ఆర్కే అంటున్నారు. ఆ రోజు రాత్రి పెద్ద తగాదా జరిగినందునే రోడ్డు మార్గంలో షర్మిల ఇడుపుల పాయ నుంచి హైద్రాబాద్ కు చేరుకున్నారని కూడా చెబుతున్నారు ఆయన. ఆస్తి వివాదం ఒకటి రేగిందని, తాను చిల్లి గవ్వ కూడా ఇవ్వనని జగన్ తెగేసి చెప్పారని కూడా ఆ కథనంలో ప్రస్తావించిన విషయం. అయితే ఇవన్నీ ఆర్కే కు మాత్రమే తెలిసిన నిజాలు. మరి! అన్నా చెల్లెళ్ల మధ్య జరిగిన వివాదం ఎలా ఉంది? ఆయనకు మాత్రమే తెలిసిన ఆస్తి తగాదాల్లో వాస్తవం ఎంత అన్నది వైసీపీ స్పష్టం చేయాలి. ఒక్కటి మాత్రం నిజం క్రిస్మస్ రోజున రాజశేఖర్ రెడ్డి సమాధి దగ్గర విజయమ్మ ఒక్కరే నివాళులు అర్పించడం. ఇక ఈ తగాదాలు తీర్చేంత శక్తి ఆమెకు లేదని అందుకే ఆమె ఒంటరి అయిపోయారని ఎన్నడూ లేనంత సానుభూతి వచనాలు ఆర్కే వినిపించారు. ఈ ఇంటి గుట్టు ఆర్కేకు షర్మిల చెప్పి ఉన్నారా లేదా షర్మిలే దగ్గరుండి ఈ కథనంకు సంబంధించిన వివరాలు అన్నీ అందించి ప్రసారం చేయించారా?