పంజాబ్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ...!
ఇక భారతీయ జనతా పార్టీ అయితే... కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టేందుకు మెగా ప్లాన్ వేసింది. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్తో పొత్తు పెట్టుకున్న కమలం పార్టీ... తాజాగా హస్తం పార్టీకి మరో ఝలక్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి రాణా గుర్మీత్ సోధీ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు అయ్యింది. తొలి నుంచి కెప్టెన్ అమరీందర్ సింగ్కు అత్యంత సన్నిహితునిగా గుర్మీత్ సోధీకి పేరు ఉంది. సరిగ్గా ఎన్నికలకు ముందు హస్తం పార్టీకి రాజీనామా చేసిన సోధీ... బీజేపీ పంజాబ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గజేంద్ర సింగ్ షెకావత్ సమక్షంలో బీజేపీలో చేరారు సోధీ. బీజేపీ కేంద్ర కార్యాలయంలో రాణా గుర్మీత్ సోధీకి పార్టీ కండువా కప్పి బీజేపీ సభ్యత్వం అందజేశారు గజేంద్ర సింగ్ షెకావత్. పంజాబ్ రాష్ట్రంలో మత సామరస్యం నెలకొల్పడంతో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సోధీ విమర్శించారు. అందుకే బీజేపీ చేరినట్లు వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో పంజాబ్లో బీజేపీ గెలుపు కోసం తన వంతు కృషి చేస్తానన్నారు సోధీ.