విద్యార్థుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్..!

NAGARJUNA NAKKA
ఇంటర్ చదువుతున్న విద్యార్థుల్లో 18ఏళ్లు నిండిన వారికి వ్యాక్సిన్లు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థుల్లో 18ఏళ్లు నిండిన వారు 55వేల 250మంది ఉన్నట్టు అధికారులు లెక్క తేల్చారు. వీరందరికీ త్వరలో వ్యాక్సిన్లు వేయనున్నట్టు చెప్పారు. అలాగే ఇప్పటి వరకు వ్యాక్సిన్ వేసుకోని టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ కు కూడా టీకాలు వేయాలని నిర్ణయించారు.
మరోవైపు విద్యాసంస్థల్లో కరోనా కేసులు వస్తున్న కారణంగా.. తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కొన్ని హాస్టళ్లలోనే కేసులు వస్తున్నాయనీ.. అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. కరోనా కేసులు ఎక్కువగా వస్తే ప్రభుత్వం సమీక్షిస్తుందని.. అప్పుడు విద్యాసంస్థలై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఉపాధ్యాయులతోపాటు తల్లిదండ్రులు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు.
అంతేకాదు ఉద్యోగులు కరోనా వ్యాక్సిన్ తీసుకుంటేనే ఈ నెల వేతనం ఇస్తామని తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ ఆదేశాలు జారీ చేసింది. ఏదైనా కారణంతో, ఆధారాలను డాక్టర్ల ధృవీకరణతో అందించాలని తెలిపింది. స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించినా.. కొందరు టీకాలు తీసుకోలేదని ఎండీ మురళీధర్ చెప్పారు. ఇలాంటి వారి వల్ల సాధారణ ప్రజలకు కరోనా సోకే అవకాశం ఉన్నందున టీకాలను తప్పనిసరి చేశామన్నారు.
ఇక తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24గంటల్లో 40వేల 730 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 203 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారితో మరొకరు మృతి చెందారు. ఇక మరో 160మంది కరోనా బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3వేల 852యాక్టివ్ కేసులున్నాయి.

మొత్తానికి ఒమిక్రాన్ వేరియంట్ మన దేశంలోకి ప్రవేశించిన కారణంగా తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మహమ్మారి విద్యార్థుల దరిదాపుల్లోకి రాకుడదని గట్టిగా నిర్ణయించుకుంది. అందుకే వ్యాక్సినేషన్ ను వేగవంతం చేసింది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వానికి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: