కేరళలో భారీ వర్షాలు... అయ్యప్ప దర్శనానికి బ్రేక్...!

Podili Ravindranath
భారీ వర్షాలు దక్షిణ భారతాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో... ఇప్పటికే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు భారీ వర్షానికి తడిసి ముద్దయ్యాయి. చెన్నై మహా నగరం నీటిలో మునిగిపోయింది. చివరికి మద్రాస్ హైకోర్టు కూడా ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా విస్తారంగావర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం వాన నీటిలో ఉంది. ఇప్పటికే కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక తిరుమల శ్రీవారి దర్శనానికి కూడా భక్తులను రావద్దని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఆదేశించారు. ఇప్పుడు రెండు రోజులుగా కేరళలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే కేరళలోని అన్ని జలాశయాలు నీటితో నిండిపోయాయి. భారీ వరదలతో పంబా నది పొటెత్తింది. దీంతో ట్రావెన్ కోర్ దేవస్థానం అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. శబరిమలకు వచ్చే అయ్యప్ప భక్తులను రావద్దని అధికారులు ఆదేశించారు. పంబ నదిలో వరద ఉధృతి కారణంగా నదిలోకి భక్తును అనుమతించడం లేదు.
కరోనా వైరస్ కారణంగా అయ్యప్ప భక్తుల అనుమతిపై అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కొవిడ్ నిబంధనలు పక్కాగా పాటిస్తూ... కేవలం వ్యాక్సిన్ డోస్ వేయించుకున్న భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తున్నారు. అది కూడా ఆన్ లైన్ ద్వారా ముందుగా టైమ్ స్లాట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే. ఇక వార్షిక మండలం - మకరవిళక్కు సీజన్ కోసం రెండు రోజుల క్రితమే అయ్యప్ప ఆలయాన్ని అధికారులు తెరిచారు. భారీ వర్షాల కారణంగా పంబ డ్యామ్‌ వరద నీరు పోటెత్తింది. దీంతో డ్యామ్ దిగువ ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. డ్యామ్ గేట్లు ఎత్తిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మరోవైపు కక్కి - అనాతోడ్ రిజర్వాయర్ వద్దకూడా రెడ్ అలర్ట్ నోటీసులు జారీ చేశారు. సోమవారం ఉదయం నుంచి అయ్యప్ప దర్శనానికి భక్తులను అనుమతిస్తామని ట్రావెన్ కోర్ దేవస్థానం అధికారులు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: