రేపే టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశం..ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే..?
సైబరాబాద్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో పోలీసు బందోబస్తూ నిర్వహిస్తున్నారు. ఈ ప్లీనరి సమావేశం సందర్భంగా నగరంలో పలు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి అధికసంఖ్యలో ప్రముఖులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు హాజరు కానుండడంతో ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశాలున్నాయని.. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. నీరూస్ నుండి గచ్చిబౌలి జంక్షన్కు వెళ్లే వారు సీఓడీ అయ్యప్ప సొసైటీ, మాదాపూర్ నుంచి దుర్గం చెరువు, ఇన్ ఆర్బిట్ మాల్, ఐటీసీ కొహినూర్, ఐకియా, బయో డైవర్శిటీ, గచ్చిబౌలి, సైబర్ టవర్ జంక్షన్ వైపు వెళ్లాలని.. మియాపూర్, కొత్తగూడ, హఫీజ్పేట్ నుంచి హైటెక్ సిటీ, సైబర్ టవర్స్, జూబ్లీహిల్స్ వైపు వెళ్లే వారు రోలింగ్ హిల్స్ ఏఐజీ దవాఖాన, ఐకియా, ఇన్ ఆర్బిట్ మాల్, దుర్గం చెరువు రోడ్డులోకి వెళ్లాలని సూచించారు. అదేవిధంగా సైబర్ టవర్ జంక్షన్కు వెళ్లొద్దని హెచ్చరించారు. ఇక ఆర్సీపురం, చందానగర్ నుంచి మాదాపూర్, గచ్చిబౌలి వెళ్లేవారు, బీహెచ్ఈఎల్, నల్లగండ్ల, హెచ్సీయూ, ఐఐఐటీ గచ్చిబౌలి రూట్లలో వెళ్లాలని చెప్పారు. మిగతా రూట్లలో వెళ్లొద్దని సూచించారు. మిగతా రూట్లలో వెళ్లితే ట్రాఫిక్ జామ్ కావడంతో పాటు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని వెల్లడించారు.
మరోవైపు ఎంపీ సంతోష్ కుమార్ తాజాగా ఎంపీ రంజిత్ రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, పార్టీ నాయకులతో కలిసి హైటెక్స్లో ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఎంపీ సంతోష్కుమార్ మాట్లాడారు. టీఆర్ఎస్ ద్విదశాబ్ది ఉత్సవాలకు వేదిక సిద్ధమైందని వెల్లడించారు. దాదాపు 6వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నారని తెలిపారు. 2018లో మేడ్చల్ జిల్లా కొంపల్లిలో జరిగినప్పుడు కూడ దాదాపు 6వేల మంది ప్రతినిధులు హాజరయ్యారని గుర్తు చేశారు. ప్రతినిధుల నమోదు కోసం 35 కౌంటర్లు ఏర్పాటు చేశామని, ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు మొదటి సెషన్ ఉంటుందని తెలిపారు. అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ జరుగుతుందని వివరించారు. ఇప్పటికే ప్లీనరీకి హాజరయ్యే ప్రతినిధులకు ప్రత్యేక పాస్లను సైతం అందజేసినట్టు తెలిపారు. ట్రాఫిక్ ఇబ్బంది కలుగకుండా వేదిక చుట్టూ 8 కేంద్రాల్లో పార్కింగ్కు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.