ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్ కు వీరభక్తుడు. కేసీఆర్ అంటే ఆయనకు ఎంతో పిచ్చి.. పడి చచ్చిపోతాడు. చివరకు కేసీఆర్ అంటే ఆయనకు ఓ దేవుడు.. తన దేవుడిని పూజించు కునేందుకు ఆయన ఏకంగా ఓ గుడి కూడా కట్టేశాడు. అయితే ఇప్పుడు ఆ వీరభక్తుడికి కోపం వచ్చేసింది. తన దేవుడు కోసం కట్టిన గుడిని అమ్మేస్తానని సంచలన ప్రకటన చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళితే మంచిర్యాల జిల్లా దండేపల్లికి చెందిన గుండ రవీందర్ స్వరాష్ట్రం కోసం తపించి ఉద్యమాలు, నిరసనలు, ఆందోళనలు చేయడంతో పాటు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ముందు నుంచి టీఆర్ ఎస్ లో ఉన్న ఆయన పార్టీ కోసం పడని కష్టం అంటూ లేదు. 2010 నుంచి ఆయన టీఆర్ ఎస్ లోనే కొనసాగుతున్నారు. రు. 3 లక్షల సొంత డబ్బుతో ఆయన కేసీఆర్ కు ఏకంగా గుడి కూడా కట్టేశారు. కేసీఆర్ తో పాటు తెలంగాణ తల్లి, ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాలను తన ఇంటి ముందు నిర్మించారు.
పార్టీ కోసం తాను ఇంత చేసినా .. తనకు పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత లేదని. ఆయన గత కొంత కాలంగా ఆవేదన చెందుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన తాను దేవుడుగా భావిస్తూ కేసీఆర్ కు కట్టిన గుడిని అమ్మేస్తున్నట్టు సోషల్ మీడియాలో ఓ ప్రకటన పెట్టారు. రవీందర్ గ్రామంలో కేబుల్ నెట్ వర్క్ను నడుపుకుంటూ జీవనం సాగించే వారు. అయితే దీనిని వేరే వాళ్లు లాగేసు కోవడంతో ఆయన కు ఉన్న జీవనాథారం పోయినట్లయ్యింది.
తనకు న్యాయం చేయాలని ఆయన పార్టీ నేతల చుట్టూ ఎన్నో సార్లు తిరిగారు. అయినా ఆయన్ను ఎవ్వరూ పట్టించు కోలేదు. తన గోడు చెప్పుకునేందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ను కలిసేందుకు ప్రగతి భవన్ చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో ఆయన ఇటీవలే టీఆర్ ఎస్కు రాజీనామా చేసి చివిరకు బీజేపీలో చేరారు. ఇప్పుడు కేసీఆర్ గుడికి పూజలు చేయడం కూడా మానేవారు. ఇప్పుడు ఆ గుడితో పాటు విగ్రహాన్ని అమ్మేందుకు ఆన్ లైన్ ప్రకటన ఇచ్చారు. ఒక వేళ ఈ గుడిని ఎవ్వరూ కొనేందుకు ముందుకు రాకపోతే తానే స్వయంగా కూల్చివేస్తానని బాంబు పేల్చడంతో టీఆర్ ఎస్ వాళ్లు అవాక్కవుతున్నారు.