`దళిత బంధు` : కత్తికి రెండు వైపులా పదునుంటది దొర..!
పైలెట్ ప్రాజెక్టుగా దళితబంధు పథకాన్ని హుజురాబాద్ నియోజకవర్గంలో అమలు చేస్తున్నారు. అయితే, ఇతర నియోజకవర్గాల ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అయింది. తాము ఓటేస్తే గెలవలేదా అంటూ విమర్శలు చేశారు ప్రజలు. తమ నియోజకవర్గాల పరిధిలో కూడా దళిత బంధు పథకాన్ని అమలు చేసి అర్హులయిన దళిత కుటుంబాలకు రూ. 10 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే దళితలతో పాటు మాకు ఓ బంధు కావాలని మిగత సామాజిక వర్గాల వారు కూడా తమ డిమాండ్ను లేవనెత్తారు. బీసీ బంధు, గౌడ బంధు, విశ్వకర్మ బంధు, మైనారిటీ బంధు ఇలా తమకు కూడా ఓ పథకాన్ని ప్రకటించి. అర్హులకు రూ. 10 లక్షలు ఇవ్వాలని ఆయా సామాజిక వర్గాలు, ప్రతి పక్ష పార్టీల నేతలు తమ డిమాండ్ను తెర మీదకు తీసుకువచ్చారు.
ఇదే క్రమంలో సీఎం కేసీఆర్ మొన్నటికి మొన్న రాష్ట్రానికి నాలుగు దిక్కుల ఉన్న మండలాల్లో దళితబంధు పథకాన్ని అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ఇటీవలనే సన్నాహక సమావేశం కూడా నిర్వహించారు. అయితే, హుజురాబాద్ ఉప ఎన్నికల వేళ తీసుకువచ్చిన ఈ పథకం ద్వారా టీఆర్ఎస్ ప్రభుత్వానికి లాభం తో పాటు నష్టం కూడా ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గతంలో ప్రకటించిన దళితులకు మూడు ఎకరాల పంపిణీ పథకం ఎక్కడి వరకు వచ్చిందో ఎవరికీ తెలియదు.. అలాగే తెలంగాణ ఏర్పడిన వెంటనే మొదటి సీఎంగా దళితుడినే కూర్చోబెడుతానని సీఎం కేసీఆర్ ప్రగాల్భాలు పలికారు.