జగన్ ఉంటే నన్నెవరు టచ్ చేయలేరు: ఏపీ మంత్రి సంచలనం
నేను చెప్పిన దాంట్లో ఎక్కడైనా దౌర్జన్యంగా మాట్లాడింది లేదు అని ఆయన పేర్కొన్నారు. పోలీసులతో దౌర్జన్యంగా మాట్లాడి ఉంటే నాది తప్పు అని నేను ఎక్కడా దౌర్జన్యంగా మాట్లాడలేదు అని స్పష్టం చేసారు. రైతుల ఖాళీ ట్రాక్టర్లు వదలండి అని మాత్రమే చెప్పాను అన్నారు. మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇలాంటివి ప్రోత్సహించరు అని స్పష్టం చేసారు. నాపై బురదజల్లే కార్యక్రమం పెట్టుకోవద్దని అందరికీ నా వినతి అంటూ ఆయన కామెంట్స్ చేసారు. ముఖ్యమంత్రిని కలిశాను..కానీ నా నియోజకవర్గ సమస్యలపైన మాత్రమే మాట్లాడాను అన్నారు.
సీఎం తో సమావేశంలో ఇతర అంశాలు ప్రస్తావనకు రాలేదు అని ఈ సందర్భంగా స్పష్టం చేసారు. లోకేష్ కు దమ్ముంటే బహిరంగంగా మాట్లాడేందుకు రావాలి అని డిమాండ్ చేసారు. లోకేష్ కు మాట్లాడే యోగ్యతే లేదు అన్నారు ఆయన. నా నియోజకవర్గం ఆనుకునే కర్ణాటక రాష్ట్ర సరిహద్దు ఉంటుంది అని మద్యం సేవించేవారు అక్కడికి వెళ్లి మద్యం తెచ్చుకుంటున్నారు..దీన్ని నేనెలా అడ్డుకోగలను అని ఆయన వ్యాఖ్యానించారు. అర కిలోమీటర్ దూరంలోనే లో ఇతర రాష్ట్రం మద్యం దొరుకుతుంటే కొందరు తీసుకుని వచ్చి తాగుతున్నారు అన్నారు. మద్యం ఏరులై పారుతుందంటే నేనేం చేయగలను అని ప్రశ్నించారు. నేనేమైనా అదే పనిగా కాసుకుని కూర్చుంటానా అని ప్రశ్నించారు. దందా దందా అంటున్నారు..ఏం దందానో నాకు అర్థం కావడం లేదు అన్నారు. సీఎం గా జగన్ ఉన్నంతవరకు నన్ను ఎవరూ ఏమీ చేయలేరు అన్నారు ఆయన.