వినాయకచవితి :కేంద్రం పెట్టిన రాజకీయం మంటేనా..?

MOHAN BABU
మరో మూడు రోజుల్లో దేశవ్యాప్తంగా బొజ్జ గణపతి చవితి వేడుకలు జరగనున్నాయి. ప్రతి ఏటా ఈ వేడుకలను యువత ఘనంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. భారీ పందిళ్ళు.. సందళ్ళు.. ఎక్కడ చూసినా.. గణపతి బప్పా మోరియా.. అనే నినాదాలు అదో పెద్ద సంబరం! అయితే.. గత ఏడాది కరోనా ఎఫెక్ట్ కారణంగా ఈ వేడుకలపై ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి. ఇక ఇప్పుడైనా ఈ వేడుకలను నిర్వహించుకోవాలని  అనుకున్నా.. పొంచి ఉన్న కరోనా థర్డ్ వేవ్ ప్రభుత్వాలకు దడ పుట్టిస్తోంది. దీంతో ఈ ఏడాది కూడా ఆంక్షలు కొనసాగించాలనేది ప్రభుత్వాల నిర్ణయం. మరీ ముఖ్యంగా.. వ్యాక్సిన్ సహా కరోనా ఔషధాలు..ఇతరత్రా ఆర్థిక సాయాలతో  ఒకింత ఇబ్బంది పడుతున్న కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం థర్డ్ వేవ్ వస్తే మరింతగా నష్టపోతామని భావిస్తోంది.

ఈ క్రమంలో పలు వేడుకలపై నిషేధం విధిస్తోంది. ఈ క్రమంలోనే వినాయకచవితి పైన..ఆంక్షలు విధించిదనేది నిజం. ఇటీవల జరిగిన సమీక్షలో రాష్ట్రాలకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కొన్ని ఆదేశాలు జారీ చేసింది. గుంపులుగా, సమూహాలుగా నిర్వహించుకునే ఏ  కార్యక్రమానికి అనుమతి ఇవ్వవద్దని ఆదేశించింది. అంటే.. దీని అర్థం వినాయక చవితిని దృష్టిలో పెట్టుకునే కదా?! కానీ కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని నేరుగా చెప్పకుండా పరోక్ష ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు కరోనా కేసులు పెరిగితే రాష్ట్రాలు బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా హెచ్చరించింది. ఈ పరిణామాలతో ఏపీ ప్రభుత్వం వినాయక చవితి పై ఆంక్షలు విధించింది. రాష్ట్రంలో వినాయక మండపాల కు అనుమతి ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నారు. చవితి ఉత్సవాలు ఇళ్లకే పరిమితం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజారోగ్యం దృష్ట్యా ఈ జాగ్రత్తలు తప్పవని స్పష్టం చేశారు. దీంతో బిజెపి వర్సెస్ వైసిపి మధ్య మాటల మంటలు రాజుకున్నాయి. వినాయక చవితి ఉత్సవాలకు మాత్రమే కరోనా నిబంధనలు అమలు చేయడంపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది . చవితికి పందిళ్ళు వేసుకొని, ఉత్సవాలు నిర్వహించుకునేందుకు అనుమతించాలన్న డిమాండ్ తో ఆందోళనలకు దిగింది.

మరోవైపు గణపతి ఉత్సవాలు జోరుగా జరిగే తెలంగాణలో మాత్రం ఇప్పటి వరకు కేసీఆర్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అంటే..మొత్తంగా చూస్తే.. చవితి వేడుకల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరి రాష్ట్రాల్లో చిచ్చు పెడుతోందని అంటున్నారు పరిశీలకులు. ఇక ఇదే విషయాన్ని ఏపీ మంత్రులు కూడా స్పష్టం చేస్తున్నారు. కేంద్రం ఇచ్చిన ఆదేశాల తోనే తాము ఆంక్షలు విధించామని అంటున్నారు. మరి ఇది ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: