చంద్రబాబు Vs జగన్: మహిళలు - చిన్నారులు
- ఆర్టీసీలో మహిళా కండక్టర్లూ బాబు చలవే
- అమ్మవడి, మహిళల పేరుతో ఇళ్లు జగన్ ఘనతే..!
( అమరావతి - ఇండియా హెరాల్డ్ )
సమాజంలో మహిళల పాత్ర అనన్యసామాన్యం. ఒకప్పుడు ఇంటికే పరిమితమైనా.. గత రెండు దశాబ్దాలు గా అనేక రంగాల్లో మహిళలు పుంజుకున్నారు. అవని నుంచి అంతరిక్షం దాకా.. మహిళలు అడుగు పెట్టని రంగం లేదు. ఈ క్రమంలో కేంద్రం నుంచి రాష్ట్రాల వరకు వారికి ప్రాధాన్యం పెరిగింది. ఈ క్రమంలో ఏపీలోనూ .. మహిళా సాధికారతకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు ప్రభుత్వానికి. జగన్ ప్రభుత్వానికి కొన్ని సారూప్యతలు ఉన్నా.. అదేసమయంలో చాలా తేడాలు కూడా ఉన్నాయి.
చంద్రబాబు ప్రభుత్వాన్ని పరిశీలిస్తే.. డ్వాక్రా మహిళలను ప్రోత్సహించారు. వారికి రుణాలు ఇప్పించడం తోపాటు.. స్వయంగా యూనిట్లు పెట్టుకుని అభివృద్ధి చెందేలా కూడా.. కృషి చేశారు. ఉద్యోగాలు.. ఆస్తుల్లో నూ వారికి ప్రాధాన్యం ఇచ్చారు. ఆర్టీసీలో మహిళా కండెక్టర్లను ప్రవేశ పెట్టిన ఘనత(ఉమ్మడి రాష్ట్రం) కూడా .. చంద్రబాబుదే. ఇక, పథకాల రూపంలో వారికి సాయం అందించారు. దీనిని ఎవరూ కాదనలేరు. అయితే.. పూర్తిస్థాయిలో వారికి స్థిర ఆస్తులు పంచడంలో మాత్రం చంద్రబాబు దృష్టి పెట్టలేక పోయారు.
ఈ విషయంలో జగన్ ప్రభుత్వం మరింత దూకుడుగా ముందుకు సాగింది. అమ్మ ఒడి.. వంటి కీలకమైన పథకం ద్వారా.. మహిళలను తనవైపు తిప్పుకోవడంలో వైసీపీ ప్రభుత్వం సక్సెస్ అయింది. ఇతర పథకాల్లోనూ ఎక్కువగా మహిళలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇక, మరో అత్యంత ముఖ్య విషయం ఇళ్ల స్థలాల పంపిణీ. ఈ విషయంలో జగన్ ఏకంగా మహిళల పేరుతోనే ఇళ్లు ఇచ్చారు. దీంతో జగన్ ప్రభుత్వం మహిళల విషయంలో చాలానే చేసిందనే పేరు తెచ్చుకుంది.
ఇక, చిన్నారుల విషయాన్ని తీసుకుంటే.. గతంలోనూ అంటే.. చంద్రబాబు హయాంలోనూ అంగన్ వాడీ లు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాలు ఉన్నాయి. కానీ, అప్పట్లో వాటిపై పర్యవేక్షణ కేవలం 10 శాతం ఉండేది. దీంతో పిల్లలకు అవి దూరమయ్యాయి. ఇక, జగన్ సర్కారు విషయానికి వస్తే.. మాత్రం.. అంగన్ వాడీల నుంచి మధ్యాహ్న భోజనం వరకు కూడా.. పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకువచ్చారు. మధ్యాహ్న భోజనంలో ఏం వడ్డించాలనే మెనూలను స్వయంగా సీఎం జగన్ నిర్ణయించడం.. నిపుణులైన వారి సలహాలు తీసుకుని ముందుకు సాగడం వంటివి.. జగన్ సక్సెస్కు కారణమని చెప్పాలి.