ఆ రెండు సార్లు షర్మిల ఏం అడిగింది.. జగన్ ఎందుకు ఇవ్వలేదు ?
చివరకు ఈ గ్యాప్ ఎంతలా ఉందంటే... కనీసం తమ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని అన్నాచెల్లెళ్లు జగన్, షర్మిల ఇడుపులపాయలో కలుస్తారని ఆశించిన వాళ్లు కూడా డిజప్పాయింట్ అయ్యేలా ఉంది. తండ్రి జయంత రోజు షర్మిల పార్టీ ప్రకటన చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ రోజు ఆమె ఉదయం ఇడుపులపాయకు వెళ్లి తండ్రి సమాధి వద్ద నివాళులర్పించనున్నారు. అయితే జగన్ ముందుగానే ఆ రోజు ఇడుపుల పాయకు వెళ్లాల్సి ఉంది. ఇప్పుడు షర్మిల వెళుతుండడంతో ఆయన షెడ్యూల్ మారుతోంది.
వాస్తవంగా షర్మిల వైసీపీలో పదవి ఆశించారు. 2014 ఎన్నికల్లోనే ఆమె కడప ఎంపీ సీటు అడిగితే దానిని అవినాష్కు ఇచ్చారు. ఒంగోలుపై ఆశ పడితే బాబాయ్ సుబ్బారెడ్డికి ఇచ్చారు. చివరకు ఖమ్మంపై ఆశలు పెట్టుకుంటే దానిని శ్రీనివాస్ రెడ్డికి ఇస్తానని చెప్పానని అక్కడ నుంచి కూడా తప్పించారు. ఇటు వైజాగ్ నుంచి తల్లి విజయలక్ష్మి పోటీలో ఉండంతో షర్మిలకు ఛాన్స్ రాలేదు. ఇక గత ఎన్నికల్లోనూ కడప అవినాష్కే ఇచ్చారు.. ఒంగోలులో బాబాయ్ను తప్పించినా దానిని మాగుంటకు ఇచ్చారు. చివరకు ఆమె రాజ్యసభ అయినా వస్తుందనుకుంటే అది కూడా ఇవ్వలేదు. చివరకు అన్న పార్టీలో తనకు ప్రాధాన్యత లేదని డిసైడ్ అయ్యాకే ఆమె తాను సత్తా చాటేందుకు కొత్త పార్టీ పెడుతున్నారు.