రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ చీఫ్ గా అధిష్టానం ప్రకటనతోనే పార్టీ రాజకీయాల్లో ఆసక్తికర సన్నివేశాలు మొదలయ్యాయి. కాంగ్రెస్కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు ప్రగతి భవన్ వెళ్ళిన మరుసటి రోజే పీసీసీ చీఫ్ ప్రకటన వెలువడటంతో పార్టీలో చర్చలు సాగుతున్నాయి. రేవంతు పిసిసి చీఫ్ పగ్గాలు చేపట్టినందున రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయ వర్గాల్లో చర్చలు కూడా కొనసాగుతున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రత్యర్థి బీజేపీ అవుతుందా? టిఆర్ఎస్ అవుతుందా..? అనే భావన ప్రజల్లో నడుస్తోంది. అయితే హుజరాబాద్ ఉప ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ప్రభావం ఏవిధంగా ఉండబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. రేవంత్ రెడ్డికి పిసిసి చీఫ్ రాకుండా టిఆర్ఎస్ పార్టీ విశ్వప్రయత్నాలు చేసిందని అయినా ఫలించలేదని, ఇకపై అసలు ఆట మొదలవుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి, మరియు టిఆర్ఎస్ కోవర్టు అనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి ని పీసీసీ చీఫ్ గా ఎన్నుకోవడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఒక్కసారిగా కొండంత బలం వచ్చినట్లయింది. కాంగ్రెస్ పార్టీలోనే రేవంత్ కు వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలు చేపట్టక పోవచ్చు అని ఈ పరిణామాలు చూస్తే అర్థమవుతుంది. రేవంత్రెడ్డి ముందుగా పార్టీని గ్రామ స్థాయి నుండి బలోపేతం చేయాలని ఆలోచనతో వున్నట్టు, దీనిపైనే ముందుగా దృష్టి సారిస్తానని తెలుస్తోంది. ఇందులో భాగమే భట్టి విక్రమార్క, షబ్బీర్ ఆలీ, జానారెడ్డి లాంటి సీనియర్ నాయకులను వారింటికి వెళ్లి కలవడం చూస్తే అర్థమవుతుంది. అలాగే కొండ విశ్వేశ్వర్ రెడ్డి తల్లి ఇటీవలే మరణించింది. ఆయన్ను ఈ రోజు వెళ్లి రేవంత్ రెడ్డి పరామర్శించనున్నారు.
పార్టీలో సైలెంట్గా ఉన్న వారిని కలుపుకు పోవడంతో పాటు పాత మిత్రులను ఆకర్షించడంలో రేవంత్ రెడ్డి తమదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి పిసిసి ఎన్నుకోవడంతో టిఆర్ఎస్ లో సైతం పావులు కదిపే అవకాశం ఉండడంతో, అసంతృప్తి లీడర్లు రేవంత్ ఆకర్షణలో పడకుండా వీలైనంత త్వరగా నామినేటెడ్ పోస్టులను ప్రకటించి కాపాడుకునే ప్రయత్నం చేస్తోందన్న ఊహాగానాలు వినబడుతున్నాయి. ఇప్పటినుంచి రేవంత్ వేసే అడుగులకు అనుగుణంగా రాజకీయ సమీకరణాలు మారనున్నాయి.