సహజీవనంపై ఏడాది వ్యవధిలో రెండు భిన్న తీర్పులు!!
సహజీవనం.. ఆంగ్లంలో లివింగ్ రిలేషన్షిప్గా వ్యవహరిస్తారు. భారతదేశ సాంప్రదాయం ప్రకారం ఒక స్త్రీ, పురుషుడు కలిసి జీవిస్తున్నారంటే వారిద్దరికీ వివాహమైందని అర్థం. వివాహమవకుండా కలిసి జీవిస్తున్నారంటే సహజీవనం చేస్తున్నారని అర్థం. పాశ్చాత్య దేశాలకు చెందిన ఈ ధోరణికి భారతీయ సమాజం క్రమేణా అలవాటుపడుతోంది. జననం నుంచి వానప్రస్థం వరకు నాలుగు దశలుగా ఉండే ఉన్న మనిషి జీవితకాలాన్నిదాదాపుగా అందరూ మరిచిపోయారు. వయసులో ఉన్నప్పుడు డబ్బులు సంపాదించడం.. ఎంజాయ్ చేయడం.. అంతవరకే ఆలోచనలు ఆగిపోతున్నాయి. భవిష్యత్తు గురించి ఎవరూ ఆలోచించడంలేదు. అప్పటి సంగతి అప్పుడు చూసుకోవచ్చులే.. అవన్నీ ఇప్పుడే ఆలోచిస్తూ కూర్చుంటే జీవించలేమనే ధోరణికి వచ్చేశారు.
నైతికంగా ఆమోదయోగ్యమేనా?
'సహజీవనం'పై పంజాబ్-హర్యానా హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. వివాహం కాకుండా కలిసి జీవించడమనేది సామాజికంగా, నైతికంగా ఆమోదయోగ్యం కాదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. సహజీవనం చేస్తున్న జంటకు తమ తల్లిదండ్రుల నుంచి రక్షణ కల్పించేందుకు నిరాకరించింది. గుల్జా కుమారి, గౌరీందర్ సింగ్ అనే జంట.. తాము త్వరలో పెళ్లి చేసుకుంటామని, తమ తల్లిదండ్రుల నుంచి రక్షణ కల్పించాలని కోర్టును కోరారు. ప్రస్తుతం సహజీవనంలో ఉన్నామని చెపుతున్న జంటకు రక్షణ కల్పించాలంటూ తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని, సామాజికంగా, నైతికంగా ఆమోదయోగ్యమైన పనైతే ఇచ్చేవారిమని న్యాయస్థానం స్పష్టం చేసింది.
సమాజానికి తప్పుడు సంకేతాలు?
ఇలాంటి పిటిషన్ ఒకటి ఇటీవలే పంజాబ్-హర్యానా హైకోర్టులో దాఖలైంది. దాన్ని మరో బెంచ్ కొట్టివేసింది. సహజీవనం చేస్తున్న జంటలకు రక్షణ కల్పించడం వల్ల సమాజంలో తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని, వ్యవస్థలో సరికొత్త సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించింది. ప్రేమికులు రెండు రోజులు కలిసున్నా అది సహజీవనం కిందకే వస్తుందంటూ ఇదే కోర్టు సంవత్సరం కిందట ఒక కేసులో తీర్పు వెలువరించింది. తన ప్రియురాలిని అప్పగించాంటూ ఓ యువకుడు వేసిన పిటిషన్పై విచారించిన పంజాబ్, హర్యానా హైకోర్టు డివిజనల్ బెంచ్ ఈ తీర్పు ఇచ్చింది. యువకుడితో ఆమె సహజీవనం చేసినట్లు ఎలాంటి ఆధారాలు లేవని, ఆ యువతి కుటుంబం పరువు తీశాడని చివాట్లు పెట్టి.. లక్ష రూపాయలు జరిమానా విధించింది. ఒకే రకమైన కేసులో ఏడాది వ్యవధిలోనే రెండు భిన్నమైన తీర్పులు రావడంపై సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయోమయానికి గురిచేస్తున్న సహజీవన సంబంధాలపై సుప్రీంకోర్టు స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు.