చైనాలో జీమెయిల్ బంద్!

Chowdary Sirisha
అధికారికంగా ప్రకటించకుండానే గూగుల్ మెయిల్ సర్వీస్ ను చైనా బొంద పెట్టింది. లేదా బంద్ చేసింది. తద్వారా అమెరికా సామ్రాజ్యం తరపున ప్రపంచ మెయిల్, సర్చ్, ట్యూబ్, మొబైల్ వినియోగదారులందరి వివరాలను రహస్యంగానూ, బహిరంగంగానూ సేకరిస్తున్న గూగుల్ కంపెనీ అరాచకాల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న దేశంగా చైనా తన పేరు నిలబెట్టుకుంది. ఇంటర్నెట్ ప్రపంచాన్ని, కంప్యూటర్ ప్రపంచాన్ని సొంత లాభాల కోసం విచ్చలవిడిగా వినియోగించడం మైక్రో సాఫ్ట్ ప్రారంభించగా అదే పనిని అనేక మెట్ల ఎత్తుకు సిగ్గు లేకుండా తీసుకెళ్లిన కంపెనీ గూగుల్. ప్రపంచంలో ప్రతి ఒక్కరి వ్యక్తిగత వివరాలతో డేటా బ్యాంకును ఏర్పరచడమే మా ధ్యేయం అని అనుమానం లేకుండా ప్రకటించిన కంపెనీ గూగుల్. అలాంటి దగుల్బాజీ కంపెనీని ఏ దేశం అరికట్టినా నిస్సందేహంగా సంతోషించవచ్చు. గూగుల్ మెయిల్ సర్వీసులను చైనా బంద్ చేసిన సంగతిని ఆ కంపెనీయే ప్రకటించింది. గూగుల్ ట్రాన్స్ పరెన్సీ రిపోర్ట్ పేరుతో ఆ కంపెనీ అట్టహాసంగా ప్రకటించే నివేదికలో చైనా నుండి వచ్చే జీమెయిల్ ట్రాఫిక్ ను ‘జీరో’గా గూగుల్ చూపింది. గత శనివారం వెలువడిన నివేదికలో ఇలా జీరో చూపించగా, సోమవారం నాడు కొద్దిగా ట్రాఫిక్ పెరిగినట్లు చూపించింది. అది చాలా చాలా కొద్దిగా మాత్రమేనని ఎ.పి వార్తా సంస్ధ తెలిపింది. చైనా ఇంటర్నెట్ నియంత్రణ సంస్ధ ‘చైనా ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ ఆఫీస్’ కు ఈ విషయమై సమాచారం కోరుతూ కాల్స్ చేశామని కానీ తమకు స్పందన అందలేదని ఎ.పి తెలిపింది. అయితే చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి హువా చున్ యింగ్ ఈ విషయమై కొద్దిగా సమాధానం ఇచ్చారు. చైనాలో చట్టబద్ధంగా వ్యాపారం చేసే కంపెనీలను తమ ప్రభుత్వం ఆహ్వానిస్తుందని ఆమె తెలిపారు. తద్వారా గూగుల్ కంపెనీ చట్ట విరుద్ధ కార్యకలాపాలను నిర్వహిస్తున్న సంగతిని ఆమె పరోక్షంగా తెలియజెప్పారు. 2009లోనే చైనాపై గూగుల్ యుద్ధం ప్రకటించింది. (అవును. గూగుల్ పై చైనా యుద్ధం ప్రకటించడం కాదు.) తన సర్చ్ ఇంజన్ ఫలితాలపై చైనా విధించిన ఆంక్షలను అమలు చేసేది లేదని, చైనా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామిక, రాజకీయ హక్కులకు భంగకరం అనీ చెబుతూ గూగుల్ ఈ యుద్ధం ప్రకటించింది. వినియోగదారుల సమస్త సమాచారాన్ని దొంగతనంగా సేకరించి దాచిపెట్టే గూగుల్ తానే ఓ గొప్ప ప్రజాస్వామ్య సంరక్షక ఫోజు పెట్టింది. అచ్చం అమెరికా సామ్రాజ్యవాదం తరహాలోనే! చైనా తన దేశంలోకి చొరబడే ఇంటర్నెట్ సమాచార ప్రవాహాన్ని నియంత్రించేందుకు ‘ది గ్రేట్ ఫైర్ వాల్ ఆఫ్ చైనా’ అనే సాఫ్ట్ వేర్ ను అభివృద్ధి చేసుకుంది. పొర్నోగ్రఫీ వెబ్ సైట్లను, పశ్చిమ దేశాలు ప్రచారం చేసే చైనా వ్యతిరేక రాజకీయ సమాచారాన్ని ఈ ఫైర్ వాల్ ద్వారా చైనా అడ్డుకుంటుంది. గూగుల్ సెర్చ్ ఇంజన్ లో ఈ తరహా వెబ్ సైట్ల నుండి వచ్చే ఫలితాలను చూపించకుండా అడ్డుకుంటుంది. గూగుల్ సెర్చ్ వ్యాపారంలో భారీ మొత్తం పోర్నోగ్రఫీ నుండే వస్తుందని ఒక అంచనా. తాము ప్రచురించే బూతు బొమ్మల్ని గూగుల్ ఉచితంగా చూపడం వలన తాము దివాళా తీశామని వివిధ బూతు పత్రికలు, వెబ్ సైట్లు గూగుల్ పై అమెరికా కోర్టుల్లో కేసులు కూడా వేశాయి. అలాంటి ఘన చరిత్ర కలిగిన గూగుల్ ను నిషేధించడం జనానికి శుభవార్త కాక ఏమవుతుంది? చైనాలో స్ధానికంగా అభివృద్ధి చేసిన సర్చ్ ఇంజన్ బైదు చాలా పాపులర్. బైదుతో పోటీ నెగ్గాలంటే బూతు ఫలితాలు, రాజకీయ దుష్ప్రచార సమాచారం తన సర్చ్ ఇంజన్ లో అనుమతీస్తేనే సాధ్యం అవుతుందని గూగుల్ గ్రహించింది. కానీ పైకి అదే చెబితే ఉమ్మేస్తారు. కనుక ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, రాజకీయ స్వేచ్ఛ ఇత్యాది కాకమ్మ కబుర్లు చెబుతూ చైనాలో తన వ్యాపారంపై చైనా విధించిన పరిమితులను అమలు చేయబోమని 2009లో ప్రకటించింది. గూగుల్ కి మద్దతుగా అప్పటి అమెరికా విదేశీ మంత్రి హిల్లరీ క్లింటన్ కూడా చైనా వ్యతిరేక ప్రకటనలు గుప్పించారు. మైక్రోసాఫ్ట్, యాహూ, యాపిల్ లాంటి ఇతర ఐ.టి కంపెనీలు కూడా గూగుల్ కి తోడు నిలవాలని ఆమె పిలుపులు ఇచ్చారు. సాధారణంగా గూగుల్ లాంటి భారీ బహుళజాతి కంపెనీలు అలిగితే ఆయా దేశాల ప్రభుత్వాలు, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రభుత్వాలు వణికి చస్తాయి. పెట్టుబడులు వెళ్లిపోతాయో ఏమో అని భయపడిపోతాయి. ఆ భయంతో కాళ్ళబేరానికి వస్తాయి. కానీ చైనా సింపుల్ గా “నా షరతులు అమలు చేస్తేనే ఇక్కడ వ్యాపారం చెయ్యి. లేదా నిరభ్యంతరంగా మూటా ముల్లె సర్దుకోవచ్చు” అని చెప్పేసింది. హిల్లరీ క్లింటన్ ను ‘ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని’ హెచ్చరించింది. ఫలితంగా కొన్ని రోజులు ఎగిరెగిరి పడిన గూగుల్ తన పధకం పారకపోవడంతో తానే వెనక్కి తగ్గి చర్చలు చేద్దాం రమ్మంది. చైనాలో చైనీయ గూగుల్ వెబ్ సైట్ కు బదులు హాంగ్ కాంగ్ వెబ్ సైట్ కు చైనీయ సర్చ్ ట్రాఫిక్ మళ్లించాలని వేడుకుంది. ఆ విధంగా ‘ఇక చైనాలో వ్యాపారం చేసేది లేద’న్న తన మాట నెగ్గుతుందని భావించింది. చైనా దానికి ఓ.కె అంది. కానీ హాంగ్ కాంగ్ ట్రాఫిక్ ను కూడా వడకట్టడం చైనా మానుకోలేదు. ఈ అయిదేళ్ళ కాలంలో చైనా వ్యాపారం, ఆర్ధిక శక్తి మరింత వృద్ధి చెందాయి. గూగుల్ వల్ల ఎప్పటికైనా ప్రమాదమే తప్ప ఉపయోగం లేదని భావించిందో ఏమో జీ మెయిల్ సేవలను కూడా ఇప్పుడు బంద్ చేసి బొంద పెట్టింది. గూగుల్, ఫేస్ బుక్ తదితర ఇంటర్నెట్ కంపెనీలను మన జీవితాల్లో ఎంత పరిమితం చేయగలిగితే అంత ఉపయోగం. కానీ నేటి ఇంటర్నెట్ యుగంలో ప్రతి చిన్న, పాపులర్ స్టార్టప్ ఐ.టి కంపెనీలను గూగుల్, యాహూ, మైక్రోసాఫ్ట్, ఫేస్ బుక్ లాంటి దిగ్గజాలు కొనిపారేస్తున్న దశలో ఇది బొత్తిగా అసాధ్యంగా మారింది. కాబట్టి ఆయా దేశాలు తమ తమ సొంత కంపెనీలను అభివృద్ధి చేసుకుని అమెరికా ఐ.టి కంపెనీల దండయాత్రకు చెక్ పెట్టాలి. గూగుల్, యాహూ, లైవ్ లాంటి ప్రైవేటు ఈ మెయిల్ సేవలను ప్రభుత్వ సంస్ధలు, అధికారులు ఉపయోగించడం మానుకోవాలని దీనివల్ల దేశ రహస్యాల భద్రతకు ప్రమాదం ఉన్నదని ఇటీవల భారత ప్రభుత్వం ఒక సర్క్యులర్ జారీ చేసింది. వాటికి బదులు ఎన్.ఐ.సి సేవలను వాడుకోవాలని ఆ సర్క్యులర్ సూచించింది. కానీ ఎన్.ఐ.సి సేవలు ప్రభుత్వ సంస్ధలు, సిబ్బందికే తప్ప పౌరులకు అందుబాటులో ఉండవు. ఆ విధంగా భారత ప్రజలను భారత ప్రభుత్వమే గూగుల్, యాహూ, ఎం.ఎస్… లాంటి ఐ.టి మత్తగజాల వేటకు వదిలిపెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: