పాకిస్తాన్ పై పవన్ కళ్యాణ్ ప్రసంశలు

Gullapally Rajesh
ధర్మం విచ్ఛిన్నానికే శ్రీరామచంద్ర మూర్తి విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. పాకిస్థాన్ లో ఆలయాన్ని ధ్వంసం చేసిన నిందితులను అరెస్ట్ చేశారు అని,   జగన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆపాటి చర్యలు కూడా తీసుకోలేదా? అని ప్రశ్నించారు. ఆలయ ఆస్తుల ధ్వంసానికి సర్కార్ బాధ్యత వహించాలి  అని సూచించారు. ‘మూర్తీభవించిన ధర్మం శ్రీరామచంద్రుడు’ అంటూ మారీచుడు అనే రాక్షసుడు రావణాసురుడితో చెప్పాడు అని అన్నారు.  త్రేతాయుగంలో ఒక రాక్షసుడు శ్రీరాముని గుణగణాలను ఉన్నతంగా చెబితే...
రాక్షస వారసులెవరో వర్తమానంలో ధర్మ విచ్ఛిన్నానికి ఒడిగట్టారు అని మండిపడ్డారు.  రాష్ట్రంలో హిందూ విశ్వాసాలకు విఘాతం కలిగించే కుట్ర సాగుతోంది అని పవన్ అన్నారు.  తాజాగా కర్నూలు జిల్లా మర్లబండలో ఆంజయనేయ స్వామి ఆలయ గోపురంపై ఉన్న సీతారామచంద్రుల విగ్రహాలను పగలగొట్టడం దుర్మార్గమైన చర్య అని ఆయన ఆరోపించారు. ఈ వరుస ఘటనలను ప్రతి ఒక్కరం ఖండించాలి అని, గత యేడాదిన్నర కాలంగా రాష్ట్రంలో హిందూ దేవాలయాలకు, విగ్రహాలకు అపవిత్రత జరుగుతున్నా ప్రభుత్వం కిమ్మనకుండా ఉండటం వల్లే మతోన్మాదులు మరింతగా తెగబడుతున్నారు అన్నారు.
పొరుగున ఉన్న శత్రు దేశంలో హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేస్తే అక్కడి ప్రభుత్వం 45మంది నిందితులను అదుపులోకి తీసుకుంది అని ఆయన అన్నారు.  ఆ ఆలయాన్ని పునర్నిర్మించే బాధ్యత కూడా తీసుకొంది అని అన్నారు. శత్రు దేశం పాటి చర్యలను కూడా  జగన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకోలేదా? అని నిలదీశారు.  శక్తిపీఠం ఉన్న పిఠాపురంలో విగ్రహాల ధ్వంసం ఘటన నుంచి తాజాగా రామతీర్థం, రాజమహేంద్రవరం వరకూ అని ఆయన ఆరోపించారు. ఇప్పుడు మర్లబండ వరకూ విగ్రహాలను పగలగొడుతున్నా, రథాలను తగలబెడుతున్నా  ప్రభుత్వ స్పందన ఉదాసీనంగా ఉంది అన్నారు. దేవుడిపై భారం వేసిన నిర్లిప్త ధోరణి ఇలాంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడేవారిని మరింత ప్రోత్సహించేలా ఉంది అని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: