రైతు సంక్షేమమే ధ్యేయంగా జగన్ అడుగులు !

NAGARJUNA NAKKA

రుణాల మంజూరులో వ్యవసాయం, ఎంఎస్ఎంఈ రంగాలకు పెద్దపీట వేయాలని ఏపీ ప్రభుత్వం బ్యాంకర్లను కోరింది. ముఖ్యమంత్రి కార్యాలయంలో జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఈ ఏడాది రుణ వితరణపై చర్చించారు. సున్నా వడ్డీ రుణాలు, కౌలు రైతులకు రుణాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ముఖ్యమంత్రి జగన్ బ్యాంకర్లకు సూచించారు. 

 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగింది. 2020-21 సంవత్సరంలో రుణాల లక్ష్యం 2లక్షల 51 వేల 600 కోట్లు. ఇది గత ఏడాదితో పోలిస్తే 9.78 శాతం అధికం. వ్యవసాయరంగానికి లక్ష 28 వేల 660 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది గత ఏడాదితో పోలిస్తే 11.9శాతం అధికం. 2019-20 రుణప్రణాళికలో 99.42 శాతం లక్ష్యాన్ని చేరుకుందని సీఎం తెలిపారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు 39 వేల 600 కోట్ల రుణాలు ఇవ్వాలని ఏపీ సర్కారు భావిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే ఇది 10 శాతం అధికం. 

 

విద్యా రుణాల కింద రూ.1900 కోట్లు, ఇళ్ల రుణాల కింద రూ.9 వేల 710 కోట్లు, సోషల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కింద రూ.410 కోట్లు ఇవ్వాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. పునరుత్పాదక ఇంధన రంగానికి 454 కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు. వ్యవసాయ రంగంలో యాంత్రీకరణకు రూ.3 వేల 400 కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తం మీద ప్రాధాన్యతా రంగానికి రూ.లక్ష 87 వేల 550 కోట్లు ఇవ్వాలని భావిస్తుండగా.. ఇది గత ఏడాదితో పోలిస్తే 10.88 శాతం అధికం. ప్రాధాన్యేతర రంగానికి రూ.64 వేల 50 కోట్లు రుణాలుగా ఇవ్వాలని లక్ష్యం. గత ఏడాదితో పోలిస్తే ఇది 6.75 శాతం అధికమని సీఎం జగన్ పేర్కొన్నారు. 

 

రైతులకు సున్నా వడ్డీ సకాలంలోనే ఇవ్వాలన్న కృతనిశ్చయంతో ఏపీ ప్రభుత్వం ఉంది. ఖరీఫ్‌ రుణాలకు సంబంధించి సున్నా వడ్డీ డబ్బును రబీ నాటికి చెల్లిస్తామని, రబీ రుణాలకు సంబంధించి సున్నా వడ్డీ డబ్బును ఖరీఫ్‌ నాటికి చెల్లిస్తామని బ్యాంకర్లకు తెలిపింది. దీనికి సంబంధిచిన వివరాలు సకాలంలో ప్రభుత్వానికి సమర్పించాలని అధికారులు కోరారు. గ్రామాల్లో గోదాములు, గ్రేడింగ్, సార్టింగ్‌ తదితర ఫుడ్‌ ప్రాసెసింగ్‌ కోసం ఒక ప్రత్యేక ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని, దీని కోసం తగిన సహాయం అందించాలని కోరారు. ప్రతి మండలానికీ కోల్డ్‌ స్టోరేజీ, కోల్డ్‌ రూమ్‌లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఆర్బీకేల ద్వారా రైతు ఉత్పత్తుల సమాచారాన్ని సెంట్రల్‌ సర్వర్‌కు అనుసంధానం చేసి వారి మార్కెటింగ్‌కు సహకారం అందిస్తామని సీఎం జగన్ తెలిపారు. రాష్ట్రంలో చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులకూ తగిన సహకారం అందించాలని ఆర్థికశాఖ అధికారులు బ్యాంకర్లను కోరారు. గోదావరిలో వరద జలాలను వినియోగించుకోవడానికి బృహత్‌ ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని, దీనికి తగిన విధంగా తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు. కౌలు రైతుల రుణాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని  కోరారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: