మహానేత బాటలోనే జగన్.. త్వరలోనే రచ్చబండ.. !
కరోనా పరిస్థితులు అదుపులోకి వచ్చిన తర్వాత రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ఏపీ సీఎం జగన్ ప్రకటించారు. కరోనా బాధితులు కోరిన అరగంటలోగా బెడ్ ఇచ్చితీరాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు జగన్. ఆర్డర్ చేసిన 72 గంటల్లో ఇసుక కూడా డెలివరీ కావాలని ఆదేశాలిచ్చారు.
స్పందన కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పేదలకు ఇళ్ల పట్టాల పంపిణి అంశం పై జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజున రాష్ట్రంలోని పేదలకు కూడా స్వాతంత్య్రం వస్తుందని భావిస్తున్నామని చెప్పారు జగన్. పట్టాల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన అన్ని పనులను పూర్తి చేయాలని, అదే విధంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్లాట్ల లబ్దిదారు జాబితా డిస్ప్లే అవుతుందా.. లేదా అనే అంశం పై కూడా దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. అదే సమయంలో ఇళ్ళ పట్టాల పంపిణి నిరంతర ప్రక్రియ అని, అర్హత ఉండి దరఖాస్తు చేసుకుంటే తర్వాత అయినా 90 రోజుల్లో మంజూరు చేసే విధంగా యంత్రాంగం పని చేయాలని ఆదేశించారు జగన్. స్పందనలో పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇళ్లపట్టాల పైనే అత్యధికంగా దరఖాస్తులు వస్తున్నాయని అన్నారాయన. కోవిడ్ పరిస్థితులు తగ్గగానే రచ్చ బండ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో పర్యటిస్తానని స్పష్టం చేశారు.
కోవిడ్ పేషెంట్ లకు హాస్పిటల్స్లో అరగంటలో బెడ్ కేటాయించాలని ఆదేశించారు జగన్. పరిస్థితులను ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచాలని స్పష్టం చేశారు సీఎం.
వ్యవసాయం, నాడు-నేడు, గ్రామీణ ఉపాధి హామీ, ఇసుక వంటి అంశాలపై కూడా సీఎం సమీక్షించారు. ఇసుక కొరత రాకుండా చూడాలన్న సీఎం...ఉభయ గోదావరి, గుంటూరు జిల్లాల్లో బ్యాక్లాగ్ల పై దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశించారు. రెండు, మూడు రోజుల్లో ప్రత్యేకంగా డ్రైవ్ నిర్వహించి సమస్యను పరిష్కరించాలని సూచించారు. 72 గంటల్లో ఇసుక డెలివరీ చేయాలని స్పష్టం చేశారు.
గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైయస్ ఆర్ రూరల్ హెల్త్ క్లినిక్స్, వైయస్ ఆర్ అర్బన్ హెల్త్ క్లినిక్స్ పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు సీఎం. కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం కోసం స్థలాల గుర్తింపును వెంటనే పూర్తిచేయాలన్నారు. నాడు-నేడు కింద స్కూళ్ళల్లో చేపడుతున్న సివిల్ పనులు ఆగస్ట్ 31 లోపు పూర్తి కావాలని ఆదేశించారు.