ఆ న్యూస్ పేపర్ కు పరిటాల సునీత స్ట్రాంగ్ వార్నింగ్..?

Chakravarthi Kalyan

ప్రముఖ దిన పత్రిక సాక్షికి ఆంధ్రప్రదేశ్ మంత్రి పరిటాల సునీత వార్నింగ్ ఇచ్చారు. తనపై, తన కుటుంబంపై ఆ పత్రిక కక్షగట్టి తప్పుడు వార్తా కథనాలు ప్రచురిస్తోందని ఆమె ఆరోపించారు. సాక్షి పత్రిక ఉద్దేశపూర్వకంగానే పని కట్టుకుని తన కుటుంబంపై దుష్ప్రచారం చేస్తోందని అనంతపురం జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో విమర్శించారు.



అనంతపురం జిల్లా అభివృద్ధికి పరిటాల కుటుంబం ఎంతో ప్రయత్నం చేస్తోందని.. దాన్ని సహించలేని వైసీపీ నాయకులు తమ పత్రిక ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఒక పేపర్ ఉంది.. ఒక చానల్ ఉంది.. పరిటాల కుటుంబానికి సంబంధించిన వార్తలు ఉంటేనే ఆ పేపర్ ప్రింటవుతుంది..అంటూ సునీత మండిపడ్డారు.



పరిటాల కుటుంబాన్ని ఎవరైనా వైసీపీ నేత విమర్శిస్తే.. దానికి పది కలిపి పెద్ద వార్తలు ప్రచురిస్తున్నారని పరిటాల సునీత విమర్శించారు. అంతే కాదు.. ఇటీవల సాక్షి పత్రికలో వచ్చిన కథనాలతో కూడిన ఫైల్ ను ఆమె ప్రజలకు చూపారు. ఈ వార్తలన్నీ కేవలం గత రెండు నెలల కాలంలో మా కుటుంబంపై వచ్చినవేనని వివరించారు.



కేవలం 2 నెలల్లోనే ఇన్ని వార్తలు రాశారు.. ఇక ఈ నాలుగేళ్లలో రాసినవన్నీ తీసుకొస్తే పెద్ద గ్రంధమే అవుతుందని పరిటాల సునీత అన్నారు. వైసీపీ నేతలు ఎన్ని విమర్శలు చేసినా.. తాము చేసిన అభివృద్ధి ప్రజలు గమనిస్తున్నారని.. వారే తీర్పు చెబుతారని పరిటాల సునీత ధీమా వ్యక్తం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: