రాహుల్ గాంధి నిన్న స్వాతంత్ర దినోత్సవం రోజున హైదరాబాద్ కు ఏతెంచారు. దాదాపు నాలుగేళ్ళు తెలంగాణా ముఖం చూసి ఎరగరు. కుమ్ములాటలతో తెలంగాణా కాంగ్రెస్ కునారిల్లుతున్నా దీన్ని సరైన దారిలో పెట్టాలన్న తపనే లేని ఈ కాంగ్రెస్ అధ్యక్షుడు అటు కేంద్రంలోని బిజెపిని ఇటు రాష్ట్రంలోని టిఆరెస్ ను సరూర్ నగర్ స్టేడియంలో జరిగిన బహ్రంగ సభలో తూర్పారబట్టారు.
60 యేళ్ళ కాంగ్రెస్ పాలనలో జరగని పాపకార్యమేమున్నది. ఈ రోజు రాహుల్ పత్తిత్తు కబుర్లు చెపితే ప్రజలు ఊర్కుంటారా? ఇతర పార్టీ నాయకులు అంగీకరిస్తారా? కుటుంబ పాలన అంటూ విమర్శించినా, మీడియా స్వేచ్చ అంటూ నిష్టూరమాడినా, అవినీతి అంటూ ఎద్దేవా చేసినా, ప్రతి విమర్శ ఆయనకే బౌన్స్ బాక్ అయింది.
రాష్ట్ర ఐటి మరియు పురపాలక శాఖామాత్యులు కలవకుంట్ల తారక రామారావు కరీంనగర్ జిల్లా ఎలగందులలో రాష్ట్రప్రభుత్వం ₹88 కోట్ల బడ్జెట్ తో చేపట్టనున్న కరీంనగర్-కామారెడ్డి రహదారి విస్తరణ పనులకు నిన్న శంకుస్థాపన చేశారు. కరీంనగర్ నుంచి కామారెడ్డి వరకూ నాలుగు వరుసల రహదారి విస్తరణ కోసం ఆర్ధిక శాఖామాత్యులు ఈటల రాజేందర్ తో కలిసి శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతల వైఖరిపై మంత్రి కేటీఆర్ మండి పడ్డారు. నాలుగేళ్లుగా రాష్ట్రానికి రానివారు ఇప్పుడు ఓట్ల కోసం వచ్చారని రాహుల్ గాంధీ పై విమర్శలు గుప్పించారు. సొంత నియోజకవర్గం లో రాహుల్ గాంధి మున్సిపాలిటీని కూడా గెలిపించుకోలేకపోయారన్న కేటీఆర్ రాహుల్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ కాంగ్రెస్ నాశనమవుతుందని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ హయాంలో జలయజ్ఞం ధనయజ్ఞంగా మారిందని విమర్శించారు. రాహుల్గాంధీ కూర్చున్న వేదికపై అటూ ఇటూ చూస్తే, సీబీఐ కేసుల్లో ఉన్న వారు ఒక వైపు, ఓటు నోటు కేసులో ఉన్నవారు ఇటువైపు ఉన్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, అవినీతి, అవిభక్త కవలలని, అకాశంలో ఉన్న 2జీ నుంచి పాతాళంలో ఉన్నబొగ్గు వరకూ పంచభూతాలను కాంగ్రెస్ పార్టీ పరమాన్నం లాగా భోంచేసిందని ఆరోపించారు. రాహుల్ గాంధీతో పాటు వేదికపై ఉన్న వారంతా బెయిల్పై బయట ఉన్న వాళ్లేనని మంత్రి కేటీఆర్ తెలిపారు.
ఇదిలా ఉండగా తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద మీరు ఎవరికీ నివాళులర్పించారో తెలుసా? అని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీని సూటిగా, ట్విట్టర్ వేదికగా ప్రశ్నిస్తూ విమర్శల వర్షం కురిపించారు. తెలంగాణ పర్యటనకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ కేసీఆర్ పై, టీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు.ఈ విమర్శలపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు.
తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద మీరు నివాళి ఎవరికి అర్పించారో తెలుసా? అని రాహుల్ ను కేటీఆర్ అడిగారు.
1969 నాటి ఉద్యమం సందర్భంగా నాటి ప్రధాని ఇందిరాగాంధీ 369 మందిని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపించిన వారికే మీరు నివాళులర్పించారని కేటీఆర్ గుర్తు చేశారు.
'మీడియా స్వేచ్ఛ గురించి, అది కూడా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాహుల్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.
దేశ చరిత్రలో ఎమర్జెన్సీ విధించిన చరిత్ర మీ కాంగ్రెస్ది కాదా? ప్రజాస్వామ్య విలువలను కాలరాసింది మీ పార్టీ కాదా? అని కేటీఆర్ రాహుల్ను ప్రశ్నించారు.
తమ ప్రభుత్వం తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణం కోసం త్వరితగతిన పనులను చేస్తుండగా ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకొనేందుకు మీ పార్టీ నేతలు కేసులు వేశారని కేటీఆర్ రాహుల్కు గుర్తు చేశారు. ప్రాజెక్టులపై వేసిన కేసులను ఉపసంహరింపజేయాలని మీ పార్టీ నేతలకు మీరు హైద్రాబాద్ నుండి తిరిగి వెళ్లే ముందైనా సూచిస్తే బాగుండేదని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. లేకపోతే అభివృద్ధిని అడ్డుకునే పార్టీగా కాంగ్రెస్పై ప్రజలు శాశ్వత ముద్ర వేస్తారని హెచ్చరించారు. అవినీతి గురించి రాహుల్ మాట్లాడటాన్ని కేటీఆర్ తప్పుబట్టారు. ‘వేదికపై మీ చుట్టూ కూర్చున్న వారిలో సగం మంది సీబీఐ కేసుల్లోనో, అవినీతి కేసుల్లోనో చిక్కుకుని బెయిల్పై వచ్చారు. అన్నట్టు మరిచిపోయా! మీది స్కాం కాంగ్రెస్ పార్టీ కదా!
"ఏ ఫర్ ఆదర్శ్, బీ ఫర్ బోఫోర్స్, సీ ఫర్ కామెన్వెల్త్" ఇంకా చెప్పాలా సర్ ? అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు.
(₹910603234300000/- this is Congress corruption value in Rupee terms)