ఆరు రోజుల నిరాహారదీక్షను భగ్నం చేసిన తర్వాత జగన్ క్రమంగా కోలుకుంటున్నారు. దీక్షను బలవంతంగా భగ్నం చేసి ఆసుపత్రిలో చేర్చిన తర్వాత మొదట జగన్ ద్రవాహారం, ఫ్లూయిడ్స్ తీసుకునేందుకు ఒప్పుకోలేదు. వైద్యులు బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించారని చెబుతున్నారు. ఆ తర్వాత మాత్రం జగన్ వారికి బాగానే సహకరించారు.
నిరాహారదీక్ష సందర్భంగా ప్రభుత్వ వైద్యులు ఎప్పటికప్పుడు జగన్ ఆరోగ్యం చెక్ చేస్తూనే ఉన్నారు. హెల్త్ బులెటిన్లు విడుదల చేశారు. ఆరోరోజు బాగా నీరసించడం, సుగర్ లెవర్స్ బాగా పడిపోవడంతో పాటు కీటోన్స్ కూడా పెరిగాయని వైద్యులు చెప్పారు. మొత్తం మీద ఆసుపత్రిలో 24 గంటలు ఉన్నాక జగన్ పూర్తిగా కోలుకున్నారు.
జగన్ కోలుకున్న విషయాన్ని మంత్రి కామినేని శ్రీనివాస్ మీడియాకు చెప్పారు. ఆ సమయంలో కామినేని ఓ ఆసక్తికరమైన విషయం బయటపెట్టారు. జగన్ కు చేసిన టెస్టుల్లో అన్నీ నార్మల్ గానే వచ్చాయని.. ఒక్క యూరిక్ యాసిడ్ మాత్రం ఎక్కువగా ఉందని ఆయన మీడియాతో చెప్పారు. ఐతే.. ఈ యూరిక్ యాసిడ్ ప్లాబ్లమ్ జగన్ కు వారసత్వంగా వచ్చిందని ఆయన కుటుంబ సభ్యులే చెప్పారని కామినేని వివరించారు.
గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డికి కూడా యూరిక్ యాసిడ్ సమస్య ఉండేదట. రక్తంలో యూరిక్ ఆమ్లం హెచ్చు స్థాయిలో ఉంటే ఆర్థరైటిస్ అనే సమస్యకు దారి తీస్తుందట. శరీరంలో యూరిక్ ఆమ్లాలు పేరుకుపోతే కిడ్నీలో రాళ్ళ లాంటి ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయట. జగన్ యూరిక్ యాసిడ్ సమస్య క్రమంగా మెరుగవుతుందని.. ఆయన ఎప్పుడైనా డిశ్చార్జ్ కావచ్చని కామినేని తెలిపారు. ఆయన చెప్పిన కొన్ని గంటలకే జగన్ డిశ్చార్జ్ అయ్యారు.