దాతృత్వాన్ని చాటుకుంటున్న తెలుగు ఎన్నారైలు..?

Suma Kallamadi
కరోనా మహమ్మారిపై పోరాడుతున్న భారత దేశానికి సహాయం చేసేందుకు ప్రపంచ నలుమూలల నుంచి ఎందరో ఎన్నారైలు ముందుకు వస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రవాసులు కూడా కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. కరోనా చికిత్సకు అవసరమైన వైద్య పరికరాలను కొనుగోలు చేసి తెలుగు రాష్ట్రాలకు అందజేస్తున్నారు. వారి సొంతడబ్బుతోనే కాకుండా విరాళాలు సేకరించి మరీ భారీ సాయాలు చేస్తున్నారు. తాజాగా కూడా అటా (అమెరికా తెలుగు అసోసియేషన్‌) సభ్యులు గొప్ప సాయం చేసి అందరి మన్ననలను అందుకుంటున్నారు.

తాజాగా అమెరికా తెలుగు అసోసియేషన్ సభ్యులు కోవిడ్ -19 విపత్తు సహాయక చర్యల్లో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రులకు 400 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను విరాళంగా ఇచ్చి తమ గొప్ప మనసుని చాటుకున్నారు. మొదటిసారి 50 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను పంపించిన అటా సభ్యులు మే 1వ తేదీన 100 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను పంపించారు. ఆ తర్వాత ఏకంగా 400 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందించి చాలా మంది రోగుల ప్రాణాలను నిలబెడుతున్నారు. ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే మొత్తంగా 600 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను ఉచితంగా అందిస్తామని అటా సభ్యులు హామీ ఇవ్వడం మరొక విశేషం.


" మేము భారతీయులు గురించి ఆలోచిస్తున్నాము. ఎల్లవేళలా భారతీయుల బాగోగుల కోసమే ప్రార్థిస్తున్నాము. తాజాగా అటా 2 తెలుగు రాష్ట్రాలకు 400 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను పంపింది. మరిన్ని ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను త్వరలోనే పంపిస్తుంది" అని అటా గ్రూప్ అధ్యక్షుడు భువనేష్ బూజాలా మీడియాకు వెల్లడించారు.


ఇకపోతే ఇటీవల ఎన్‌ఆర్‌ఐ డాక్టర్‌ ప్రేమ్‌సాగర్‌రెడ్డి కరోనా చికిత్సలో అత్యవసరమైన 500 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లతో పాటు వెంటిలేటర్లు, ఇతర మెడికల్ పరికరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉచితంగా అందించి తన సేవా గుణాన్ని చాటుకున్నారు. అయితే ఇప్పటికే ఐదు కోట్ల విలువ చేసే విరాళాలు అందించిన ప్రేమ్‌సాగర్‌రెడ్డి.. త్వరలోనే మరిన్ని విరాళాలు అందిస్తామని వెల్లడించారు. ఇక ఆపత్కాలంలో అంబులెన్స్ డ్రైవర్ గా మారి సహాయం అందించిన తెలుగు ఎన్నారైలు కూడా ఉన్నారు. పుట్టిన గడ్డపై ప్రేమతో వారు చేస్తున్న సాయం అభినందనీయం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: