కన్నీటి పర్యంతమైన పవన్ కళ్యాణ్ !

Seetha Sailaja
పవన్ కళ్యాణ్ కంట కన్నీరు చూసిన అతడి అభిమానులు చెలించిపోయిన సంఘటన అభిమానుల మనసులను కదిలించివేసింది. తుని దగ్గర ఉన్న పాయకరావుపేటలో పవన్ ‘పోరాట యాత్ర’ కు సంబంధించిన ‘జనసేన’ ఫ్లేక్సీలు కడుతూ పవన్ అభిమానులు ఇద్దరు విద్యుత్‌ షాక్‌ తో మరణించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతిచెందిన ‘జనసేన’ కార్యకర్త శివ కుటుంబాన్ని పవన్‌ పరామర్శించాడు. 

శివ కుటుంబానికి తన సహాయ సహకారాలు అందిస్తానని మాట ఇవ్వడమే కాకుండా 3 లక్షల రూపాయల చెక్కును కూడ శివ కుటుంబానికి అందించాడు పవన్. అంతేకాదు శివకు కేవలం మూడు నెలల క్రితం పుట్టిన అతడి బిడ్డకు అనిరుద్ అని నామకరణం చేసి ఆ పిల్లవాడిని తన ఒడిలోకి తీసుకుని భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నాడు. 

ఈ దృశ్యం గంభీరంగా మారడంతో పవన్ అభిమానులు కూడ భావోద్వేగానికి లోనయ్యారు. అంతేకాక శివ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చాడు పవన్. పోయిన ప్రాణాన్ని తాను తీసుకురాలేకపోయినా ఆ కుటుంబానికి అండగా ఉంటానని పవన్ మాట ఇవ్వడమే కాకుండా శివ కొడుకు అనిరుద్ చదువు సంధ్యలు ‘జనసేన’ పార్టీ చూసుకుంటుంది అని మాట ఇచ్చాడు. 

ఇప్పుడు ఈ వార్త పవన్ అభిమానుల మధ్య వైరల్ గా మారడంతో పవన్ మంచి మనసును పొగుడ్తూ అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. తన అభిమానులకు ఏమాత్రం కష్టం కలిగినా చెలించిపోయే మనస్తత్వం పవన్ ది. అయితే రాజకీయాలలోకి పవన్ వచ్చిన తరువాత పవన్ అభిమానులు ‘పోరాట యాత్ర’ లో చేస్తున్న హడావిడి పవన్ కు కూడ అసహనాన్ని కలిగిస్తున్న నేపధ్యంలో అభిమానుల అత్యుత్సాహానికి ఎలా చెక్ పెట్టాలో తెలియక పవన్ సతమతమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి..
  
 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: