జూనియర్ అభిమానులను బాధ పెట్టిన నిత్యామీనన్ కామెంట్స్ !

Seetha Sailaja
ఈరోజు విడుదల అవుతున్న ‘జనతా గ్యారేజ్’ రిలీజ్ సంబరాలలో మునిగి తేలుతున్న జూనియర్ అభిమానులకు నిత్యామీనన్ నిన్న ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘జనతా గ్యారేజ్’ మూవీ గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ జూనియర్ అభిమానులకు షాక్ ఇచ్చింది అన్న వార్తలు వినపడుతున్నాయి.  ‘జనతా గ్యారేజ్’ సినిమాకు సంబంధించిన అనేక విషయాలను  నిత్యామీనన్ ఈ ఇంటర్వ్యూలో షేర్ చేసుకుంటూ ఈ సినిమా తారక్ సినిమా కాదు కొరటాల శివ సినిమా అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

దీనికి కారణం ఈ సినిమాలో నటీనటులు కనిపించరని కేవలం పాత్రలు మాత్రమే కనిపిస్తాయి అని కామెంట్స్ చేసింది నిత్యామీనన్. ఈ సినిమాలో కథ కధనం మాత్రమే హీరోలుగా కనిపిస్తాయని నటించిన నటీనటులు అంతా ఆ పాత్రలకు పరిమితం అయిపోయారు అంటూ కామెంట్స్ చేసింది నిత్యామీనన్. అయితే ఈమె కొరటాల గొప్పతనాన్ని హైలెట్ చేస్తూ చేసిన కామెంట్స్ జూనియర్ అభిమానులకు ఏ మాత్రం నచ్చలేదు అన్న వార్తలు వస్తున్నాయి.

‘బాహుబలి’ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా ఆ ఖ్యాతి హీరో ప్రభాస్ కు దక్కకుండా పేరు అంతా రాజమౌళి ఖాతాలోకి వెళ్ళి పోయినట్లు అలాగే ‘జనతా గ్యారేజ్’ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా ఆ ఖ్యాతి జూనియర్ కు దక్కకుండా ఆ బ్లాక్ బస్టర్ హిట్ కొరటాల ఖాతాలోకి వెళ్ళిపోతే ప్రయోజనం ఏమిటి ? అని నిత్యామీనన్ మాటలు వెనుక అర్ధాలను వెతుకుతున్నారు జూనియర్ అభిమానులు.

ఇదే సందర్భంలో నిత్యామీనన్ తన సహచర నటి సమంతతో తనకు అస్సలు ఇబ్బంది తలెత్తలేదని, తాను సమంత మంచి స్నేహితులమని అంటూ ఒక విషయాన్ని బయట పెట్టింది.  ‘జనతా గ్యారేజ్’ షూటింగ్ గ్యాప్ లో  తాము ప్రధానంగా గాసిప్స్ గురించి చర్చించుకున్నామని అయితే  తనపై పెద్దగా గాసిప్స్ ఉండవు కనుక అందరి గాసిప్స్ గురించి చెప్పుకుని నవ్వుకున్నామని ఈ ‘గ్యారేజ్’ విశేషాలను షేర్ చేసింది ఈ కేరళా బ్యూటీ. 

ఇక ఈ సినిమాలో మరో ప్రధాన పాత్రలో నటించిన మోహన్ లాల్ గురించి మాట్లాడుతూ దేశంలోని అద్భుతమైన నటుల్లో మోహన్ లాల్ ఒకరని అంటూ ఆయన కళ్లు తీక్షణంగా ఉంటాయని అవే సగం డైలాగుల్ని చెప్పేస్తాయని  ఆయనతో నటించడం చాల గర్వకారణంగా ఉంది అంటూ కామెంట్స్ చేసింది.  అంతేకాదు మోహన్ లాల్  లాంటి వ్యక్తితో నటించడం వల్ల నటన ఎంతో మెరుగవుతుందని తన అభిప్రాయాన్ని వెల్లడించింది నిత్యామీనన్. 

ఈ సందర్భంలో జూనియర్ గురించి మాట్లాడుతూ  జూనియర్ ఎన్టీఆర్ కు ఏదైనా విషయం చెపితే ఆ  విషయాన్ని చాల ఏకాగ్రతతో వింటాడు అన్న విషయాన్ని బయట పెడుతూ తాను ఈ సినిమాలో జూనియర్ తో  నటించిన తొలిరోజు షూటింగ్ ను గుర్తుకు చేసుకుంది.   ముంబైలో తమ మధ్య తొలిషాట్ చిత్రీకరణ జరిపే సమయంలో డైలాగ్ చెప్పడానికి ముందు ‘నేను నీ అభిమానిని, నువ్వు బాగా నటిస్తావని’ జూనియర్ ఎన్టీఆర్ తనకు కితాబ్ ఇచ్చిన విషయాన్ని గుర్తుకు చేసుకుంటూ జూనియర్ తో నటిస్తే ఒక స్పెషల్ ఎనర్జీ వస్తుంది అంటూ జూనియర్ ను ఆకాశానికి ఎత్తేసింది నిత్యామీనన్. అయితే ఈమె జూనియర్ గురించి ఇన్ని పొగడ్తలు పొగిడినా ఈ సినిమాలో పాత్రలు మాత్రమే కనిపిస్తాయి జూనియర్ కనిపించడు అన్న నిత్యామీనన్ మాటలు మాత్రం జూనియర్ అభిమానులకు బాధను కలిగించి నిత్యామీనన్ పై కోపాన్ని తెప్పించాయి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: