"కమెడియన్స్ దానికే పనికొస్తారా ఏంటి రా..?".. ఇమ్ము ఎలిమినేషన్ పై ఫ్యాన్స్ సీరియస్..!

Thota Jaya Madhuri
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఘనంగా ముగిసింది. ఈ సీజన్‌లో తొలిసారిగా ఒక కామనర్, అదికూడా ఇండియన్ ఆర్మీ సోల్జర్ టైటిల్ విన్నర్‌గా నిలవడం ప్రేక్షకుల్లో భావోద్వేగాలను రేకెత్తించింది. సాధారణ ప్రజలంతా ఈ విజయాన్ని తమ స్వంత విజయంలా భావిస్తూ ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దేశానికి సేవ చేసిన ఒక సైనికుడు బిగ్ బాస్ వేదికపై గెలవడం అనేది ఎంతో మందికి గర్వకారణంగా మారింది.అయితే, ఈ ఆనందోత్సాహాల మధ్య మరోవైపు ఇమ్మాన్యుయేల్ అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. అతని ఎలిమినేషన్ అన్యాయమంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రేక్షకులే కాకుండా, పలువురు సెలబ్రిటీలు కూడా ఈ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.



హౌస్‌లో మొత్తం 105 రోజులు గడిపిన ఇమ్మాన్యుయేల్… ప్రేక్షకులను నవ్వించాడు, ఏడిపించాడు, తన వ్యక్తిత్వం ఏంటో ప్రతి రోజూ నిరూపించుకున్నాడు. టాస్కులు ఆడలేదా అంటే కాదు, అలాగే అతిగా కన్నింగ్ గేమ్ ఆడాడా అంటే అదీ కాదు. హౌస్‌లో ఉన్నంత కాలం నిజాయితీగా, సహజంగా తన ఆటను కొనసాగించాడు. సంజనతో ఉన్న తల్లి–కొడుకు బాండ్ అయినా, తనూజతో ఏర్పడిన బెస్ట్ ఫ్రెండ్ బాండ్ అయినా… ఒక్కరోజు కూడా వాటిని గేమ్ కోసం ఉపయోగించుకోలేదు. అన్నింటికన్నా ముఖ్యంగా, ఎక్కడా నాటకీయతకు పోకుండా జెన్యూన్‌గా ఆడటం అతని ప్రత్యేకతగా నిలిచింది.


ఇలాంటి నిజాయితీకి గెలుపు దక్కదని మరోసారి రుజువైంది అంటూ ఇమ్మాన్యుయేల్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “అతను అసలు ఏం తక్కువ చేశాడు?” అంటూ ప్రశ్నిస్తున్నారు. టాప్ 4లో కూడా చోటు దక్కకపోవడం తమను తీవ్రంగా బాధించిందని, బిగ్ బాస్ నిర్ణయం పూర్తిగా అన్యాయమని వారు మండిపడుతున్నారు.ఇమ్మాన్యుయేల్ ఎలిమినేషన్‌పై ప్రముఖ జబర్దస్త్ ఆర్టిస్టులు రోషిణి మరియు గెటప్ శ్రీను కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గెటప్ శ్రీను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో స్పందిస్తూ… ఇమ్మాన్యుయేల్ ఎలిమినేషన్ తనను చాలా డీప్‌గా హర్ట్ చేసిందని, తీవ్ర నిరాశకు గురయ్యానని పేర్కొన్నాడు. 4వ స్థానంలో అతను హౌస్ నుంచి బయటకు రావడం తాను అస్సలు తట్టుకోలేకపోయానని తెలిపాడు. ప్రతి టాస్క్‌ను ఎంతో నిజాయితీగా ఆడాడని, ఒక కమెడియన్‌గా హౌస్‌లో అడుగుపెట్టినా చివరికి హీరోగా నిలిచాడని ఇమ్మాన్యుయేల్‌ను ప్రశంసించాడు.



ఇక రోషిణి కూడా ఇమ్మాన్యుయేల్ ఎలిమినేషన్‌పై తీవ్రంగా స్పందించింది. ఈ పరిణామం తనను చాలా నిరాశకు గురి చేసిందని పేర్కొంది. కష్టపడినవారికి విలువ ఉండదని, వారికి తగిన ఫలితం దక్కదని మరోసారి నిరూపితమైందని వాపోయింది. ఎంటర్టైనర్స్ అనేది కేవలం ఎంటర్టైన్ చేయడానికి మాత్రమేనని బిగ్ బాస్ స్పష్టంగా చూపించిందని వ్యాఖ్యానించింది. ఇమ్మాన్యుయేల్ ఎలిమినేట్ అయినా, నిజమైన విన్నర్ మాత్రం అతడేనని స్పష్టం చేసింది. ఎవరు ఏమనుకున్నా, ఇమ్మాన్యుయేల్‌ను చూసి తాను గర్వపడుతున్నానని రోషిణి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది.



మొత్తంగా చూస్తే, బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ముగిసినా… ఇమ్మాన్యుయేల్ ఎలిమినేషన్‌పై చర్చలు మాత్రం ఇంకా ఆగేలా కనిపించడం లేదు. అతని నిజాయితీ ఆట, సహజమైన ప్రవర్తన ప్రేక్షకుల మనసుల్లో అతడిని ఎప్పటికీ ఒక రియల్ విన్నర్గా నిలిపాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: