తేజ సజ్జా ప్రధాన పాత్రలో ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన చిత్రం హను-మాన్.గట్టి పోటీ మధ్య గతేడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈచిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.నేటితో ఇది విడుదలై ఏడాదైన సందర్భంగా ప్రశాంత్ వర్మ తాజాగా ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ఈ సినిమా తనకు విజయాన్ని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా ఇచ్చిందని అన్నారు. హనుమంతుడి గదను తన చేతిపై పచ్చబొట్టు వేయించుకున్నట్లు తెలిపారు.హను-మాన్'పై మీరు చూపించిన అశేష ప్రేమాభిమానానికి ఎంతో సంతోషంగా ఉన్నా. మన ఇతిహాస కథకు సూపర్హీరో హంగులు జోడించి మా విజన్ను మీ ముందుకు తీసుకువచ్చి నేటితో ఏడాది అవుతోంది. ఆ చిత్రానికి మీరు అందించిన సపోర్ట్ నాకెంతో విలువైనది. ఈ మేజిక్ను క్రియేట్ చేయడంలో భాగమైన నటీనటులు, నిర్మాతలకు నా ధన్యవాదాలు. విజయాన్ని మించి అభిరుచి, ఆశీస్సులు ఉంటే తప్పకుండా అద్భుతాలు సృష్టించవచ్చు అనే ఒక గట్టి నమ్మకాన్ని ఈ సినిమా నాకు అందించింది. మీరు నాపై ఉంచిన నమ్మకానికి, నాకు ఎంతగానో మద్దతు ఇస్తున్నందుకు ధన్యవాదాలు'' అని ప్రశాంత్ వర్మ పేర్కొన్నారు.'హను-మాన్'కు కొనసాగింపుగా రానుందే 'జై హనుమాన్'. కన్నడ నటుడు రిషభ్ శెట్టి ఇందులో హనుమాన్ పాత్రలో కనిపించనున్నారు.
దీనికి సంబంధించిన ఫస్ట్లుక్ను ఇప్పటికే ఆయన అభిమానులతో పంచుకున్నారు. శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన మాటేంటన్నది ఈ సీక్వెల్లో కీలకాంశం. 'హనుమాన్'లో హనుమంతుగా కనిపించిన తేజ కొత్త సినిమాలోనూ అదే పాత్ర పోషించనున్నారు. ఈ రెండు చిత్రాలు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో భాగమే.ఈ క్రమంలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ విషయానికొస్తే1989 మే 29న పాలకొల్లు, పశ్చిమగోదావరి జిల్లాలో జన్మించారు. 2018లో తొలిసారి అ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈయన, ఆ తర్వాత 2019లో కల్కి, 2021 లో జాంబిరెడ్డి, దట్ ఇస్ మహాలక్ష్మి సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించిన ఈయన, 2024 లో హనుమాన్ సినిమా చేసి ఏకంగా పాన్ ఇండియా డైరెక్టర్ గా పేరు దక్కించుకున్నారు. ఇక ప్రస్తుతం ఈయనతో సినిమాలు చేయడానికి సీనియర్ హీరోలు, స్టార్ హీరోలు కూడా రంగంలోకి దిగడంతో.. అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కాంతారా సినిమాతో భారీ పాపులారిటీ అందుకున్న రిషబ్ శెట్టి కూడా జై హనుమాన్ సినిమాలో భాగమయ్యారు అంటే ఇక ప్రశాంత్ వర్మ క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయిందని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు జై హనుమాన్ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.