విజయ్ దేవరకొండ నిరీక్షణ ఫలిస్తుందా !

Seetha Sailaja

ఎన్నో ఆశలు పెట్టుకుని నిరీక్షించిన ఫ్యామిలీ స్టార్ మూవీ ఫెయిల్ అవ్వడంతో విజయ్ దేవరకొండ అభిమానులతో పాటు ఆ యంగ్ హీరో కూడ షాక్ లోకి వెళ్ళిపోయాడు. అయితే అతడికి ఉన్న క్రేజ్ రీత్యా సినిమాలకు సంబంధించిన అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి తో ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ మూవీని చేస్తున్న విజయ్ త్వరలో రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో ఒక పీరియాడిక్ డ్రామాను చేయబోతున్న విషయం తెలిసిందే.

‘గీత గోవిందం’ తరువాత విజయ్ సుకుమార్ దర్శకత్వంలో ఒక మూవీని చేస్తాడు అన్న అధికారిక ప్రకటన వచ్చింది. అయితే ‘పుష్ప’ మూవీ తరువాత సుకుమార్ పాన్ ఇండియా సినిమాల దర్శకుడుగా మారిపోవడంతో విజయ్ చేయవలసిన మూవీ ప్రాజెక్ట్ పై సందేహాలు ఏర్పడ్డాయి. అయితే లేటెస్ట్ గా జరిగిన ‘గంగం గణేశా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత వంశీ కారుమంచి మాట్లాడుతూ కొంత ఆలస్యమైనా విజయ్ సుకుమార్ కాంబోలో సినిమా చేస్తామని ప్రకటించడంతో విజయ్ అభిమానులలో మళ్ళీ కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.

అయితే ప్రస్తుతం సుకుమార్ ‘పుష్ప 2’ తరువాత రామ్ చరణ్ తో ఒక భారీ పాన్ ఇండియా మూవీ ప్రాజెక్ట్ చేయవలసి ఉంది. ఆమూవీ తరువాత ‘పుష్ప 3’ లైన్ లోకి వచ్చే ఆస్కారం ఉంది అంటున్నారు. ప్రస్తుతం రాజమౌళి తరువాత టాప్ హీరోలు అంతా సుకుమార్ వైపే చూస్తున్నారు. దీనితో నిజంగానే సుకుమార్ విజయ్ దేవరకొండల మూవీ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కాలి అంటే కనీసం మరో మూడు సంవత్సరాలు పట్టే ఆస్కారం ఉంది.

అప్పటికి సుకుమార్ రేంజ్ అదేవిధంగా విజయ్ దేవరకొండ స్థాయి ఏవిధంగా ఉంటాయో ఎవరు చెప్పలేని విషయం. దీనితో వీరిద్దరి కాంబినేషన్ లో ప్రారంభం కావలసి ఉన్న మూవీ ప్రాజెక్ట్ కేవలం మాటలకే పరిమితం అవుతుందా లేదంటే వాస్తవ రూపం దాలుస్తుందా అన్న విషయం పై అనేక సందేహాలు చాల మందికి ఉన్నాయి. అయితే సుకుమార్ దర్శకత్వంలో తమ హీరో నటిస్తే చూడాలని భావిస్తున్న అభిమానుల కోరిక ఎప్పుడు తీరుతుందో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: