దర్శకులకు పరీక్ష పెడుతున్న ప్రేక్షకులు... ఇకపై కష్టమే ?
అలా వారు చెప్పకనే చెబుతున్నారు. స్టార్ హీరోలు ఉంటే సరిపోదు కంటెంట్ కూడా అంతకు మించి స్ట్రాంగ్ గా ఉంటేనే క్లిక్ చేస్తాం అంటూ భీష్మించుకు కూర్చున్నారు. యావరేజ్ చిత్రాలకు అడిగినంత డబ్బు చెల్లించే సమస్యే లేదని అంటున్నారు. ఈ ఏడాది వచ్చిన వాటిలో బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాలు అందుకున్న చిత్రాలు అంటే... ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్2లు అనే చెప్పాలి. విజువల్ గ్రాండియర్స్ గా వాటిపై క్రియేట్ అయిన హైప్ కి, దర్శకులు మీదున్న నమ్మకానికి భారీ క్యాస్టింగ్ కి వారి అద్భుతమైన పర్ఫార్మెన్స్ కి సినిమా ప్రెజెన్స్ కి ఫిదా అయ్యి అధిక రేట్లు పెట్టి మరి టికెట్లు కొని సినిమాలు చూసి వందల కోట్ల రూపాయలు వసూళ్ల వర్షం కురిపించారు ప్రేక్షకులు. అనుకున్న వన్ని ఇలా పర్ఫెక్ట్ గా సినిమాలో రంగరిస్తే నాలుగు వందలయినా సరే టికెట్ కొంటామని ప్రేక్షకులు ఋజువు చేశారు.
డీజే టిల్లు చిత్రం పై ఇంత పెద్ద హైప్ లేకపోయినా కొత్తదనం కురిపించే కామెడీతో సిద్దు జొన్నలగడ్డ ఆకట్టుకోవడం తో ప్రేక్షకులు సినిమాని విజయవంతం చేశారు. ఇక నాసిరకంగా ఉన్న సినిమాలను మాత్రం అస్సలు సహించం అంటూ దారుణంగా ఫెయిల్ అయ్యేలా చేశారు ఆడియన్స్. కథ లో పట్టు, భారీగా విజువల్ ఎఫెక్ట్స్ ఇలా మూవీ ఇంగ్రీడియంట్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో చిరు, చరణ్ లు వంటి అగ్ర హీరోల సినిమా సైతం ఊహించని స్థాయిలో పరాభవాన్ని ఎదుర్కొన్నాయి. సర్కారు వారి పాటలో మ్యాటర్ మరీ కంటెంట్ ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్లే మహేష్ స్థాయికి తగ్గ ఇండస్ట్రీ హిట్ అందలేదు అన్న వార్తల్లో నిజం ఉంది. అశోకవనంలో అర్జున కళ్యాణం పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ థియేటర్ కి వెళ్లి చూసేంత ప్రొడక్ట్ కాదని ప్రేక్షకులు చాలా వరకు పక్కన పెట్టేశారు.
ఇక్కడ ఆడియన్స్ చెబుతోంది ఏమిటంటే నాసిరకం ప్రొడక్ట్ కి స్టార్ హీరోల పేర్లు తగిలించినా డబ్బులు పెట్టేదే లేదని చెప్పేశారు. అయితే తాజాగా వచ్చిన ఎఫ్3 సినిమా ఫుల్ కామెడీ తో సూపర్ హిట్ అందుకుంది. కూర్చున్న మూడు గంటలు జనాల్ని మంచి మూడ్ లో మెయింటైన్ చేయడంతో ఈ సినిమాకి జనం టికెట్టు కొని ఓటేశారు. కాబట్టి సినిమాలు తీసేముందు దర్శకులు ప్రేక్షకులను పూర్తిగా దృష్టిలో పెట్టుకుని ఆచితూచి అడుగువేస్తే తప్ప జనాల్ని థియేటర్ కి రప్పించడం కష్టమే.