రేపిస్ట్ రాజు చాప్టర్ కు నిన్నటితో ఎండ్ కార్డు పడింది. ఎనిమిది రోజులుగా పోలీసులు బృందాలుగా ఏర్పడి వెతుకుతుండగా ఆ మృగాడే వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ రైల్వే ట్రాక్ పై రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులు పోలీసులు దృవీకరించారు. అయితే రాజు ఆత్మహత్య తరవాత కొన్ని పొలిటికల్ పార్టీలు ప్రభుత్వం పై మండి పడ్డాయి. రాజు మృతి పట్ల ప్రభుత్వం పై నెగిటివ్ కామెంట్లు చేశాయి. ప్రభుత్వం ఈ కేసులో విఫలం అయ్యిందని రాజు భయంతో ఆత్మహత్య చేసుకున్నాడని కొన్ని పార్టీలు వ్యాఖ్యానించగా..మరి కొందరు రాజకీయ నాయుకులు ఇలా ఎంత మందిని చంపుతారని ఇలాంటి దారుణాలు జరగకుండా ముందే ఎందుకు చర్యలు తీసుకోలేదని విమర్శలు కురిపించారు.
మరోవైపు ఇది ఎన్కౌంటర్ అని ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన వాళ్లు ఉన్నారు. అయితే తాజాగా అలాంటి కామెంట్లపై నటుడు మంచు మనోజ్ తీవ్రంగా స్పందించారు. ఇది రాష్ట్రానికి సంబంధిచిన ఇష్యూ మాత్రమే కాదని మంచు మనోజ్ పేర్కొన్నారు. ఇది నేషనల్ ఇష్యూ అని అన్నారు. ఒక మహిళకు అన్యాయం జరిగితే అది ప్రాంతానికి సంబంధించినదో లేక రాష్ట్రానికి సంబంధించిన సమస్యో కాదని మొత్తం దేశానికి సంబంధించిన సమస్య అని మనోజ్ వ్యాఖ్యానించారు. మహిళలకు సమస్య వస్తే అందరం కలిసి పోరాడాలని మనోజ్ తెలిపారు.
కులాలు మతాలు ప్రాంతాలకు అతీతంగా మహిళల రక్షణ కోసం ప్రతి ఒక్కరూ పోరాడాల్సిన అవసరం ఉందని మనోజ్ చెప్పారు. అంతే కాకుండా రాజకీయ పార్టీలు కూడా తమ ఎజెండాలను పక్కన పెట్టి మహిళలకు అన్యాయం జరిగితే కలిసి ఫైట్ చేయాలని కోరారు. తాజాగా జరిగిన సైదాబాద్ ఘటనపై కొంత మంది ఓ పొలిటికల్ పార్టీ ఫాలోవర్లు నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారని అన్నారు. ఈ సమస్య అన్ని రాజకీయ పార్టీల కంటే పెద్దదని మీ పాపులారిటీ కోసం అలాంటి కామెంట్లు చేయవద్దని మనోజ్ అన్నారు. మన చిన్నారుల కోసం..మహిళల కోసం ఓ మంచి సమాజాన్ని నిర్మిద్దామని మనోజ్ పేర్కొన్నారు.