వీధిలో ఆటలాడితే గల్లీ ఆటగాడు అంటారు. అదే గ్రౌండ్ లో ఆడితే పర్వాలేదు అనుకుంటారు. కానీ స్టేడియాల్లో ఆడితే దమ్మున్నోడు అంటారు. ఎందుకంటే ఆ స్టేజ్ కు చేరాలంటే ఎంతో కష్టపడాలి. జిల్లా.. జాతీయ స్థాయికి ఎదగాలి. అలా ఎప్పుడైతే పైకి వస్తారో గొప్ప ఆటగాడిగా పేరొందుతారు. అంతేకాదు ట్రోఫీలు.. క్యాష్ ప్రైజ్ లు గెలుచుకుంటారు. క్రీడాభిమానులు ఆటోగ్రాఫ్ ల కోసం ఎదురుచూస్తారు. వారెవ్వా గ్రేట్ స్పోర్ట్స్ మెన్ అని తెగ పొగిడేస్తారు తప్ప.. ఆ స్థాయికి రావడానికి ఎంత కష్టపడ్డారో ఎవరికీ తెలియదు. ఇప్పుడు అవే కథలుగా మారుతున్నాయి. మన దేశ క్రీడాకారుల బయోపిక్ లు ఒక్కొక్కటిగా వస్తున్నాయి. మన హీరోలు స్పోర్ట్స్ లో తమ సత్తా చాటుతున్నారు.
గంగూలీ పేరు చెబితే చాలు.. ఇండియన్ క్రికెట్లో మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్గా అందరికీ గుర్తుంటుంది. ఇండియన్ క్రికెట్కి దూకుడు నేర్పించిన గంగూలీ, ఇప్పుడు బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నాడు. బీసీసీఐ ప్రెసిడెంట్గా కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటోన్న గంగూలీ లైఫ్ స్టోరీని తెరకెక్కించబోతున్నారు. ఈ బయోపిక్లో రణ్బీర్ కపూర్ హీరోగా నటిస్తాడనే ప్రచారం జరుగుతోంది. సౌరవ్ గంగూలీ బయోపిక్ కోసం ఇద్దరు ముగ్గురు బడా నిర్మాతలు సంప్రదించారని, కథ కూడా సిద్ధమైందని తెలుస్తోంది. ఇప్పటికే స్టార్ కాస్టింగ్ కూడా ఫైనల్ చేస్తున్నారని చెప్తున్నారు. సంజయ్ దత్ బయోపిక్లో జూనియర్ సంజులా నటించి, ప్రశంసలు అందుకున్న రణ్బీర్ కపూర్ ఇప్పుడు సౌరవ్ గంగూలీ బయోపిక్లో కూడా నటిస్తాడని చెబుతున్నారు.
రణ్వీర్ సింగ్ ఇప్పటికే 83 వరల్డ్ కప్ బ్యాక్ డ్రాప్లో 83 చాంపియన్స్ అనే సినిమా చేశాడు. కభీర్ ఖాన్ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమాలో రణ్వీర్ సింగ్, హర్యానా హరికేన్ కపిల్ దేవ్ పాత్ర పోషించాడు. ఈ సినిమా పోయిన సమ్మర్లోనే రిలీజ్ కావాల్సింది. కానీ కరోనా లాక్డౌన్తో వాయిదా పడింది.
మహేంద్ర సింగ్ ధోనీకి ఇండియన్ క్రికెట్ హిస్టరీలో స్పెషల్ ఇమేజ్ ఉంది. 'టీ-20, వన్డే వరల్డ్ కప్, చాంపియన్స్ ట్రోఫీ' అందించిన కెప్టెన్గా చరిత్ర సృష్టించాడు. ఈ సక్సెస్ఫుల్ కెప్టెన్ కథని నీరజ్ పాండే 'ఎమ్.ఎస్.ధోనీ-ది అన్టోల్డ్ స్టోరీ' పేరుతో తెరకెక్కిస్తే సూపర్ హిట్ అయ్యింది. సుశాంత్ సింగ్ రాజ్పుత్ని వెండితెర ధోనీగా మార్చింది.