సోనూసూద్ అంటే ఆపదొస్తే వినిపించే పేరు. చేతికి అసలు ఎముక ఉందా అనేంతగా ఆయన సాయం చేస్తున్నారు. కోట్లు ఖర్చు పెట్టి మరీ పేదల బాధలను తీరుస్తున్న రియల్ హీరోగా సోనూ సూద్ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక కరోనా లాక్ డౌన్ సమయంలో ఆయన చేసిన సాయం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ కారణాలతోనే బాధితులంతా సోనూ సూద్ ను దేవుడిలా ఇప్పటికీ కొలుస్తూనే ఉన్నారు.
అయితే సోను సూద్ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు కేవలం కొవిడ్ పేషెంట్లకు మాత్రమే పరిమితం కాకుండా ఇతర మార్గాల ద్వారా చాలా మందికి ఉపాధి కల్పించడం వరకు కొనసాగుతోంది. వైద్య చికిత్స అందించేందుకు సోనూసూద్ చేయని పనులు లేవనే చెప్పాలి. ఇక తాజాగా ఆయన సీఏ చదవాలనుకునే పేద విద్యార్థుల కోసం గొప్ప వరాన్ని ప్రకటించారు.
తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలోనే ఉచిత సీఏ కోచింగ్ సెంటర్లను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. ఇందులో ఇంటర్న్షిప్, కోచింగ్, ప్లేస్మెంట్లను ఇప్పిస్తామని కూడా స్పష్టం చేశారు. తమ సూద్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఇది నిర్వహిస్తామని సోనుసూద్ ప్రకటించాడు. పేద విద్యార్థులు ఎవరైనా చదవాలనుకుంటే తామే బాధ్యత తీసుకుంటామని సోనూ చెప్పాడు.
ఇందుకోసం తమ చారిటబుల్ ట్రస్టు వెబ్సైట్ లో రిజిస్టర్ చేసుకోవచ్చని వివరించాడు. ఇక నెటిజన్లు సోనూ సూద్ సాయాన్ని చూసి ప్రశంసించారు. చాలా మంది విద్యార్థులు సోనూసూద్ ప్రకటనపై వేలాది కామెంట్లు చేస్తున్నారు. ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు విద్యార్థులు. కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు, ఇతర పేద విద్యార్థుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సోనూ చెప్పారు. ఇక పేద విద్యార్థులకు మద్దతుగా ఉండాలని విశ్వవిద్యాలయాలు, పాఠశాలలలను కోరాడు సోనూ సూద్. ఇక ఆసుపత్రిలో పేదలకు పడకలు, మందులతో పాటే ఆక్సిజన్ సరఫరా లాంటివి అందించి ఇప్పటికే ఆయన వార్తల్లో నిలిచారు. ఇక దేశవ్యాప్తంగా ఆయన 18 ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు.