ప్రస్తుతం రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాధేశ్యామ్ సినిమాతో పాటు ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ మూవీ అలాగే ప్రఖ్యాత బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ అనే సినిమాను కూడా చేస్తున్నారు ప్రభాస్. కాగా వీటిలో రాధేశ్యామ్ మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తి అవగా సలార్ ఇటీవల తొలి షెడ్యూల్ ని గోదావరిఖనిలో పూర్తి చేసుకుంది. ఇక అత్యంత భారీ వ్యయంతో నిర్మాణమవుతున్న మైథలాజికల్ డ్రామా మూవీ ఆదిపురుష్ లో ప్రభాస్ రాముడు గా నటిస్తుండగా ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడు పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే.
టి సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా యొక్క ఫస్ట్ షెడ్యూల్ ఇటీవల ముంబయిలో ప్రారంభమైంది. అయితే ఆ షెడ్యూల్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో దానిని అక్కడితో నిలిపివేసినట్లు సమాచారం. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో భారీ విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా యొక్క షూటింగ్ ఇంకా పూర్తిస్థాయిలో మొదలు కావాలి అంటే మరికొంత సమయం పడుతుందని అంటున్నారు. మరోవైపు సినిమాలోని లక్ష్మణుడు, సీత సహా పలు ఇతర పాత్రల తాలూకు పాత్రధారుల ని ఎంపిక చేసే పనిలో యూనిట్ ఉందని అంటున్నారు. అలానే సినిమాకు సంబంధించి కొన్ని భారీ సెట్టింగులు కూడా ప్రస్తుతం యూనిట్ సిద్ధం చేసే పనిలో నిమగ్నమై ఉందని అంటున్నారు.
మరోవైపు ఈ సినిమా షూటింగ్ ఎటువంటి బ్రేక్స్ లేకుండా జరుగుతుందని ఇంకొక వార్త కూడా ప్రచారం అవుతుండటంతో అసలు ఆదిపురుష్ సినిమా విషయంలో ఏం జరుగుతోంది షూటింగ్ నిజంగానే జరుగుతుందా ఆగిపోయిందా అనే విషయంపై మాత్రం ఎవరికీ ఏమీ అర్థం కాకపోవడంతో పలువురు ప్రభాస్ ఫ్యాన్స్ అలానే ఆడియన్స్ ఈ మూవీ యూనిట్ నుండి ఏదైనా క్లారిఫికేషన్ వస్తే బాగుంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రచారమవుతున్న ఈ వార్తల్లో ఏది నిజమో తెలియాలంటే ఆదిపురుష్ యూనిట్ నుండి అధికారికంగా న్యూస్ బయటకు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు విశ్లేషకులు......!!