ఫ్యామిలీకి దూరంగా అల్లు అర్జున్.. ఎందుకంటే..?

Deekshitha Reddy
కరోనా టైమ్ లో రిస్క్ చేసి మరీ సినిమాల షూటింగ్ లకు వెళ్లిన నటీనటులు ఫ్యామిలీకి దూరంగా ఉన్నారు. తమ వల్ల ఇంట్లో కుటుంబ సభ్యులకు ఇబ్బంది తలెత్తకూడదనే ఉద్దేశంతోటే అలా చేశారు. అయితే కరోనా భయం తొలగిపోయాక కూడా అల్లు అర్జున్ ఫ్యామిలీకి దూరంగా ఉండేందుగు నిర్ణయం తీసుకున్నారు. దాదాపు నెలరోజులపాటు కుటుంబానికి దూరంగా అల్లుఅర్జున్ మారేడుమిల్లు అడవుల్లో మకాం పెట్టబోతున్నారు.
అల్లు అర్జున్ పుష్ప సినిమా షూటింగ్ నవంబర్ 6నుంచి మొదలు కాబోతోంది. ఏకంగా నెలరోజుల భారీ షెడ్యూల్ ఇది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీమేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. గతంలో చిత్తూరు అడవులన్నారు, ఆ తర్వాత విశాఖ అటవీ ప్రాంతంలో షూటింగ్ చేస్తారన్నారు. తీరా ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లాలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతాన్ని సెట్ చేసింది చిత్ర యూనిట్. మారేడు మిల్లి అటవీ ప్రాంతం సూపర్ గా ఉంటుంది. అందమైన పర్యాటక ప్రాంతం ఇది. ఇక్కడ షూటింగ్ అంటే నటీనటులకు పండగే. అందుకే ఇక్కడ షూటింగ్ సెట్ చేశారు సుకుమార్.
గతంలో ఒకటి రెండు పాటలకోసం, కొన్ని సీన్లకోసం మాత్రమే ఈ అటవీ ప్రాంతానికి సినిమావాళ్లు వచ్చేవారు. అయితే ఏకంగా నెలరోజులపాటు షూటింగ్ అంటే.. అల్లు అర్జున్ సినిమా అనే చెప్పాలి. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే కథ ఇది. అల్లు అర్జున్‌ మాస్‌ పాత్రలో, పుష్పరాజ్‌ అనే యువకుడిగా కనిపించనున్నాడు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందబోతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ సరసన రష్మిక నటిస్తుంది. ఈ ఇద్దరూ కూడా సినిమాలో చిత్తూరు యాస మాట్లాడతారట. దీనికోసం ఆల్రడీ ట్రైనింగ్ కూడా తీసుకున్నారట. మారేడు మిల్లి అడవుల్లో నెల రోజులపాటు కీలకమైన సన్నివేశాలతో పాటు పాట కూడా తెరకెక్కిస్తారు.
ఇక ఈ సినిమా షూటింగ్ లో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు దర్శకుడు సుకుమార్. సెట్స్ లోకి వచ్చిన తర్వాతే అందరికీ కరోనా టెస్ట్ చేయిస్తారట. ఎలాంటి అనుమానం ఉన్నా.. టీమ్ లో కీలకమైన వ్యక్తులైనా సరే.. బైట పెట్టేస్తారని టాక్. పూర్తి జాగ్రత్తలతోటే పుష్ప సినిమా షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: