క్రిష్ తెరకెక్కించిన అద్భుతం 'వేదం'కు 10 ఏళ్లు
సినిమాను తెరకెక్కించే దర్శకుల్లో ఒకొక్కరికి ఒక్కో శైలి ఉంటుంది. కొందరు క్లాస్, మాస్ అంశాలతో సినిమా తీస్తారు. మరికొందరు హీరో, హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు తీస్తారు. ఇంకొందరు కుటుంబ కథలు, సామాజిక అంశాలతో సినిమాలు తీస్తారు. అయితే.. మనిషి, జీవితం, సమాజం గురించి ఆలోచిస్తూ సినిమాలు తీసే దర్శకులు అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో దర్శకుడు ‘క్రిష్’ ముందు వరుసలో ఉంటాడు. ఆయన సినిమాల్లో మనుషులు, జీవితాలే కనబడతాయి. అలాంటి వాటిలో ‘వేదం’ ఒకటి. ఈ సినిమా విడుదలై నేటితో 10ఏళ్లు పూర్తయ్యాయి.
మనిషి, జీవితంపై తెరకెక్కిన ఈ సినిమా 2010 జూన్ 4న విడుదలైంది. ఈ సినిమాలో 4కథలు ఉంటాయి. ఆశ, కష్టం, వ్యభిచారం, మానవత్వం.. అంశాలను తీసుకుని దేనికదే విభిన్నంగా రాసుకున్నాడు క్రిష్. డబ్బుపై ఆశ ఎంతవరకైనా తీసుకెళ్తుందని అల్లు అర్జున్ పాత్ర చెప్తుంది. బతకటం కోసం ఏమైనా చేయాలని అనుష్క పాత్ర చెప్తుంది. జీవితంలో వచ్చే కష్టాలు గురించి శరణ్య, నాగయ్య పాత్రలు చెప్తాయి. మనిషిలో ఉండే మానవత్వం గురించి మంచు మనోజ్ పాత్ర చెప్తుంది. నాలుగు కథల్లో ఒకరికొకరు సంబంధం లేకపోయినా కథ చివర్లో అందరి పాత్రలు కలిసాకే ముగింపు వస్తుంది. ఓ మనిషి జీవితంలో ఎదురయ్యే సంఘటనలే ఈ సినిమాలో చూపించాడు క్రిష్.
ప్రతి వ్యక్తి ఆలోచించే సినిమాగా ‘వేదం’ విమర్శకుల ప్రశంసలు పొందింది. సినిమాకు కీరవాణి సంగీతం అందించారు. కథానుసారం వచ్చే పాటలు ఆకట్టుకుంటాయి. ‘రూపాయి..’, ‘ఎగిరిపోతే ఎంత బాగుంటుంది..’ అనే పాటలు ఆలోచన రేకెత్తిస్తాయి ఈ సినిమాకు 4 ఫిలింపేర్ అవార్డులు వచ్చాయి. ఈ సినిమా తమిళ్ లో ‘వానం’ పేరుతో క్రిష్ దర్శకత్వంలోనే తెరకెక్కింది. ఆర్కా మీడియా బ్యానర్ పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ సినిమాను నిర్మించారు.
A Decade of Vedam . I would Like to Thank each and everyone who is a part of this beautiful journey. I heart fully thank @dirkrish for his vision n passion . And I would like to thank @HeroManoj1 #Anushka @BajpayeeManoj Ji & many other actors & technicians for their support. pic.twitter.com/vEEep7Xb7l — Allu Arjun (@alluarjun) June 4, 2020