మళ్లీ బుల్లితెరపై ‘రామాయణం’ సీరియల్..!
ఒకప్పుడు టెలివిజన్ రంగంలో కోట్ల మంది ప్రేక్షకులను టీవీల ముందు కూర్చోబెట్టిన గొప్ప సీరియల్ రామాయణం. 33 ఏళ్ల క్రితం రామానంద్ సాగర్ దర్శకత్వ వహించారు. ఈ పౌరాణిక సీరియల్, జనవరి 25, 1987 నుంచి జులై 31, 1988 వరకు ప్రతి ఆదివారం ఉదయం 10-10.35 ల మధ్య మొత్తం 85 వారాల పాటు ప్రసారమయ్యింది. భారతీయ సంస్కృతికి మూలస్తంభ గ్రంథాల్లో ఒకటైన రామాయణం సీరియల్ మరోసారి భారతీయులను అలరించనుంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమైన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ప్రజలు బయటకు రాకుండా ఇంట్లోనే ఉండేలా చూడాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రేపటి(శనివారం, మార్చి-28) నుంచి ప్రసారం కానున్నట్లు సమాచార ప్రసార శాఖా మంత్రి ప్రకాశ్ జావడేకర్ తెలిపారు. డీడీ నేషనల్ లో రోజూ రెండు ఎపిసోడ్లుగా ఉదయం 9-10 గంటలు, సాయంత్రం 9-10 గంటలకు రామాయణ్ ప్రసారం కానున్నట్లు చెప్పారు. కరోనా, లాక్ డౌన్ తో ఇంట్లోనే ఉంటున్న తమకు చూసే అవకాశం కల్పించాల్సింగా ప్రజలు కోరారన్న మంత్రి… వారి కోరికతో రామాయణ్ను మళ్లీ ప్రసారం చేయనున్నట్టు తెలిపారు.
ఈ సీరియల్ ప్రతీ ఇంటి కుటుంబ సభ్యుడికి చేరువైంది. మాకు ఎనలేని ప్రేక్షదారణను తెచ్చి పెట్టింది. అలాంటి సీరియల్ మళ్లీ ప్రసారం అవుతున్నదనే విషయం సంతోషాన్ని కలిగిస్తున్నది అని అరుణ గోవిల్ (రాముడు), దీపిక చికలియా (సీత) ఆనందాన్ని పంచుకొన్నారు. ఒకప్పుడు చిన్నా పెద్ద అందరినీ బుల్లితెర ముందు కట్టిపడేసన అంత గొప్ప సిరియల్ మళ్లీ ప్రసారం కావడం పై ప్రేక్షకులు కూడా ఎంతో సంతోష పడుతున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. దేశం మొత్తం లాక్ డౌన్ చేశారు. ఈ నేపథ్యంలో ఇంత మంచి సీరియల్ మళ్లీ ప్రసారం చేయడం గొప్ప విషయం.