మా జనాలకి బాధ్యతలు నేర్పే టైం వచ్చింది... నేను కూడా అతీతుడ్ని కాదు : నాగబాబు
ఇప్పడు దేశం మొత్తం లాక్ డౌన్ చేసిన విషయం తెలిసిందే. ప్రజలు ఇంటికే పరిమితం కావాలని.. బయట తిరిగితే కరోనా వైరస్ మరింత ప్రబలిపోయే ప్రమాదం ఉందని ప్రభుత్వం హెచ్చరిస్తూనే ఉంది. కానీ జనాలు మాత్రం ఇవేవీ మాకు పట్టనట్టు యథేచ్చగా రోడ్లపై సంచరిస్తున్నారు. ఏమైనా అంటే చిత్ర విచిత్రమైన సాకులు వెతుక్కుంటున్నారు. కరోనా వైరస్ మహమ్మారిని నియంత్రించేందుకు దేశమంతా లాక్ డౌన్ విధించారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. హెచ్చరించి పంపిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం కేసులు నమోదు అవుతున్నాయి.
ఒక్క రోజే కేరళలో లాక్ డౌన్ ఉల్లంఘన కేసులు 402 నమోదు అయ్యాయి. తెలుగు రాష్ట్రల్లో లాక్ డౌన్ చాలా సీరియస్ గా అమలు చేస్తున్నారు. పోలీసులు ఎలాంటి వారినైనా వదలడం లేదు. అయితే కొన్ని చోట్ల మాత్రం ఆకతాయిలు రెచ్చిపోయి రోడ్లపై తిరుగుతున్నారు. ఇదిలా ఉంటే.. తెలంగాణలో మరో ముగ్గురికి కరోనా సోకింది. హైదరాబాదులో ఈ మూడు కేసులు నయోదయ్యాయి. రాష్ట్రంలో తొలిసారి ఇద్దరు వైద్యులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దోమలగూడలో భార్యాభర్తలైన ఇద్దరు వైద్యులకు కరోనా పాజిటివ్ గా తేలింది.
ఈ కొత్త కేసులతో తెలంగాణలో వైరస్ సోకినవారి సంఖ్య 44కు చేరుకుంది. తాజాగా కరోనా విజృంభణ నేపథ్యంలో ఒక ప్రొఫెసర్ టీవీలో చెప్పిన ఓ వ్యాఖ్య తనకు బాగా నచ్చిందని జనసేన నేత, సినీనటుడు నాగబాబు అన్నారు. ప్రైమ్ 9 న్యూస్ లో ఎవరో ప్రొఫెసర్ దాస్ గారు అన్నమాట నాకు చాలా నచ్చింది. మనం ప్రజలకి హక్కులు నేర్పాము. బాధ్యతలు నేర్పలేదు అన్నారు. ఇది అక్షర సత్యం. ఈ తప్పు ప్రభుత్వం వారిదే. మా జనాలకి బాధ్యతలు నేర్పే టైం వచ్చింది. నేను కూడా అతీతుడ్ని కాదు. మా ప్రజలందరినీ తన్ని బాధ్యతలు నేర్పించండి. నేర్చుకుంటాం..' అని నాగబాబు చెప్పారు.
Prime9 న్యూస్ లో ఎవరో ప్రొఫెసర్ దాస్ గారు అన్నమాట నాకు చాలా నచ్చింది."మనం ప్రజలకి హక్కులు నేర్పాము.బాధ్యతలు నేర్పలేదు"అక్షర సత్యం ...ఈ తప్పు ప్రభుత్వం వారిదే.మా జనాలకి బాధ్యతలు నేర్పే టైం వచ్చింది.నేను కూడా అతితుడ్ని కాదు.మా ప్రజలందరికీ తన్ని బాధ్యతలు నేర్పించండి.నేర్చుకుంటాం... — naga Babu konidela (@NagaBabuOffl) March 26, 2020