క్రేజీ కాంబినేషన్ - SSMB 28 పాన్ ఇండియా ఫిలిం..
టాలీవుడ్ లో అగ్రస్థానంలో ఉండే ముగ్గురి వ్యక్తుల కాంబినేషన్ లో.. ఓ సినిమా తెరకెక్కనుందనే వార్త మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది. వారే మన సూపర్ స్టార్ మహేష్ బాబు, కె.జి.యఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్, ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్. నిజంగా వీరి ముగ్గురి క్రేజీ కాంబినేషన్ కదూ!.. ఇదేదో గాసిప్ అని తేలికగా తీసుకోవడానికి లేదు.
కె.జి.యఫ్ సినిమాతో యావత్ సినీ ప్రపంచం చూపు కన్నడ ఇండస్ట్రీ వైపు తిప్పాడు యువ దర్శకుడు ప్రశాంత్ నీల్. ఇంతకుముందెన్నడూ తెరపై చూపించని కోలార్ గోల్డ్ మైనింగ్స్ బ్యాక్ డ్రాప్లో కథని ఎంచుకుని దాన్ని కమర్షియల్ యాంగిల్లో ఆవిష్కరించిన విధానం ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల వారిని కూడా విపరీతంగా ఆకట్టుకుంది. ప్రశాంత్తో సినిమా చేయడానికి పలువురు స్టార్ హీరోలు, అగ్రనిర్మాణ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి.
ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్, రెబల్ స్టార్ ప్రభాస్ వంటి హీరోల పేర్లు గతకొద్ది రోజులుగా వార్తల్లో వినిపిస్తున్నాయి. తాజా సమాచారం మేరకు.. ప్రశాంత్ కొద్ది రోజుల క్రితమే మహేష్ని కలిసి ఓ కథ చెప్పాడు. కొన్ని మార్పులతో పాటు పూర్తి కథ రెడీ అయ్యాక కలవమని మహేష్ చెప్పడంతో ప్రశాంత్ రీసెంట్గా మహేష్కు పూర్తి కథ వినిపించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.
ఈ క్రేజీ ప్రాజెక్టుని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై పాన్ ఇండియా లెవల్లో భారీస్థాయిలో నిర్మించడానికి అల్లు అరవింద్ భారీగా సన్నాహాలు చేస్తున్నారట. అన్ని కుదిరితే మహేష్ 28వ సినిమా ఇదే అవుతుంది. ఈ క్రేజీ కాంబో దాదాపు ఖరారయ్యిందని సమాచారం. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు నటించనున్న సినిమా షూటింగ్ మే నుంచి ప్రారంభం కానుంది. ప్రశాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కె.జి.యఫ్ 2 షూటింగ్ దశలో ఉంది.