ఖైదీ నెంబర్ 150తో మళ్ళీ హీరోగా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన మెగా స్టార్ చిరంజీవి ఆ సినిమా తో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకొని పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. ఆ చిత్రం తరువాత ఆయన రెండేళ్లు గ్యాప్ ఇచ్చి పీరియాడికల్ మూవీ సైరా తో గత ఏడాది దసరా కు ప్రేక్షకులముందుకు వచ్చాడు, భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం సూపర్ పాజిటివ్ రివ్యూస్ ను సొంతం చేసుకొని ప్రపంచ వ్యాప్తంగా 200కోట్ల వసూళ్లను రాబట్టింది. అయితే ఈ చిత్రం తెలుగు తోపాటు హిందీ , తమిళ , మలయాళ , కన్నడ భాషల్లో విడుదల కాగా తెలుగు , కన్నడ లో తప్ప మిగితా మూడు భాషల్లో భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది.
ఇక ఈ చిత్రం తరువాత చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ తో తన 152 వ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ చిత్రం కోసం కోకాపేట లో ప్రత్యేకంగా మిడిల్ క్లాస్ కాలనీ సెట్ వేశారు. ఆక్కడే ఈ రోజు ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. 20రోజుల పాటు జరుగనున్న ఈషెడ్యూల్ లో ఓ పాట తో పాటు కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ చిత్రానికి 'ఆచార్య' అనే టైటిల్ ను పెట్టనున్నట్లు ఫిలిం నగర్ నుండి వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈటైటిల్ విషయంలో క్లారిటీ రానుంది.
ఇక ఈ చిత్రాన్నిఈఏడాది ఆగస్టు 14న విడుదలచేయనున్నారని సమాచారం. సోషల్ మెసేజ్ తో కమర్షియల్ ఎంటర్ టైనర్లను తెరకెక్కిస్తూ బ్లాక్ బాస్టర్ హిట్లు కొడుతూ వస్తున్న కొరటాల శివ ఈ చిత్రాన్ని కూడా అదే ఫార్ములా తో తెరకెక్కిస్తున్నాడు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్నిమ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ , కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ల పై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.