కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘మన్మథుడు 2’. రకుల్ ప్రీత్ సింగ్, కీర్తి సురేష్ హీరోయిన్లు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. మనం ఎంటర్ప్రైజస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, వయ్కామ్ 18 స్టూడియోస్ పతాకాలపై నాగార్జున అక్కినేని, పి.కిరణ్ (జెమిని కిరణ్) నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఇంకా ఒక షెడ్యూల్ మిగిలి ఉంది. త్వరలోనే ఈ షెడ్యూల్ చిత్రీకరణకు కూడా ప్లాన్ చేస్తున్నారు.
ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా ద్వారా నాగార్జునతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు ప్రేక్షకులతో పంచుకుంటూ వస్తున్నారు. నాగార్జున-రకుల్, నాగార్జున-కీర్తి సురేష్ జంటల ఫొటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి. ఈ ఫొటోలతో ఇప్పటికే ‘మన్మథుడు 2’కి బోలెడంత ప్రచారం వచ్చేసింది. సినిమాపై ఇప్పటికే అంచనాలు ఏర్పడ్డాయి. ఈ అంచనాలను మరింత పెంచేందుకు చిత్ర టీజర్ను తీసుకు వస్తున్నారు.
ఈనెల 13న టీజర్ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. పనిలో పనిగా నాగార్జున, అమలలకు పెళ్లిరోజు శుభాకాంక్షలు కూడా తెలిపేశారు. నేడు నాగార్జున, అమల 27వ వివాహ వార్షికోత్సవం. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ టీజర్ విడుదల తేదీ, సమయాన్ని ప్రకటించి దాన్ని వారికి గిఫ్ట్గా ఇచ్చారు. ఈనెల 13న మధ్యాహ్నం ఒంటిగంటకు టీజర్ను విడుదల చేస్తున్నారు.