తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకప్పుడు మణిరత్నం చిత్రాలంటే ఎంత క్రేజ్ ఉండేదో అందరికీ తెలిసిందే. రోజా, బొంబాయి, గీతాంజలి మొదలయినవి మణిరత్నం ఆణిముత్యాల్లో కొన్ని మాత్రమే. ఆయన ప్రతి చిత్రం విమర్శకుల ప్రశంశలు పొందింది. ఆయన తీసిన చిత్రాల్లో ఆయనకు బాగా నచ్చింది ‘ఇద్దరు’. అందులో మోహన్లాల్ నటనకు గాను జాతీయ బహుమతి వస్తుందని ఆయన అనుకున్నాడు. కానీ రాకపోవడంతో కొంత నిరుత్సాహపడ్డాడు. ఆయన తీసిన తాజాచిత్రం 'కడలి ' దారుణమైన డిజాస్టర్ గా మిగిలింది.
దర్శకుడిగా ఆయన్ని అభిమానించే వారి సంఖ్య చాలా ఎక్కువే. అలాంటి వాళ్లలో సూపర్ స్టార్ మహేష్బాబు ఒకరు. ఇదిలా ఉంటే, మణిరత్నం దర్శకత్వంలో తాజాగా వచ్చిన సినిమా ‘చెక్క చివంత వానమ్’. తెలుగు లో ఈ చిత్రం ‘నవాబ్’ గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. సినిమా అద్భుతంగా ఉందని, మణిరత్నం మళ్లీ ఫాంలోకి వచ్చారని అంటున్నారు. తాజాగా ఈ చిత్రం గురించి మహేష్ బాబు తన స్పందన తెలియజేశారు. మణిరత్నంపై ప్రశంసల వర్షం కురిపించారు.
ఇదొక క్లాసికల్ చిత్రమని, ఈ దశాబ్దానికే గొప్ప సినిమా అని పేర్కొన్నారు. ‘ప్రతి ఒక్కరూ అద్భుతంగా నటించారు. ఎ.ఆర్.రెహమాన్ సంగీతం సూపర్. సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ ప్యూర్ క్లాస్. ఓ మణిరత్నం అభిమానిగా చెప్తున్నాను, చెన్నైలోని థియేటర్లలో ఆయన సినిమాలను చప్పట్లు కొట్టుకుంటూ చూసేవాడిని.
ఇప్పుడూ అదే చేశాను. నా హోం థియేటర్లో కాలర్ ఎగరేసి మరీ ఈ సినిమాను చూశాను’ అని మహేష్బాబు ట్వీట్ చేశారు. అంతే కాదు ‘మీరు ఒకవేళ ఈ సినిమాను చూసుండకపోతే, ఇప్పుడే టికెట్లు బుక్ చేసుకోండి. మనం ఒక క్లాసిక్ను చూస్తున్నాం. ఈ దశాబ్ది చిత్రం. ది మాస్టర్ ఈజ్ బ్యాక్ అండ్ హౌ’ అని మహేష్ పేర్కొన్నారు.