తెలుగు చిత్ర సీమలో మొదటి సారిగా సినీతారపై ఓ బయోపిక్ సినిమా తీయడం అనేది ఎంతో ఛాలెంజ్ గా తీసుకొని ‘మహానటి’ సినిమాను తీశారు దర్శకులు నాగ్ అశ్విన్. ఈ సినిమా తీయడానికి రెండు సంవత్సరాల ముందు నుంచి సావిత్రి జీవితంపై ఎంతో అవగాహన పెంచుకోవడం..ఆమెకి సంబంధించిన అన్ని వివరాలు పూర్తిగా సేకరించి రీసర్చ్ చేసి ఆ పాత్రకు తగిన నటీ నటులను ఎంపిక చేసి మొత్తానికి ‘మహానటి’ సినిమాను ప్రేక్షకులకు అందించారు. మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా ద్విభాషా చిత్రంగా రూపొందించిన ‘మహానటి’ సినిమా చిత్ర యూనిట్పై సావిత్రి భర్త జెమినీ గణేశన్ కుమార్తె, ప్రముఖ వైద్యురాలు కమలా సెల్వరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సినిమా తెలుగులో ‘మహానటి’గా విడుదల కాగా, తమిళంలో ‘నడిగర్ తిలగం’ పేరుతో విడుదలైంది. ఈ సినిమా ఫస్ట్ షో చూసిని సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి ప్రశంసలు కురిపించారు. కాగా ‘మహానటి’ సినిమా తిలకించిన తర్వాత కమలా సెల్వరాజ్ మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక వెబ్సైట్ విలేకరితో మాట్లాడుతూ నడిగైయిన్తిలగం చిత్రంలో తన తండ్రి జెమినీ గణేశన్ను తప్పుగా చిత్రీకరించారంటూ తీవ్రంగా ఆరోపించారు. తన తండ్రికి కళంకం ఆపాదించేలా చిత్రంలో చూపించారని అన్నారు.
తన తండ్రి బిజీ నటుడన్న విషయం అందరికీ తెలిసిన విషయమేనన్నారు. అలాంటిది ఆయన అవకాశాలు లేక ఖాళీగా ఉన్నట్లు చూపించడమేంటని ప్రశ్నించారు. అంతే కాదు సావిత్రి కన్నా ముందే జెమినీ గణేషన్ తన తల్లిని వివాహం చేసుకున్నారని..ఇద్దరు పిల్లలను కూడా కన్నారని ఆమె గుర్తు చేశారు. తొలి ప్రేమ సావిత్రిపై కాదని, తన తల్లిపైనేనని అన్నారు. సినిమాలో చూపించినట్టు సావిత్రికి నాన్న మద్యం అలవాటు చేయలేదని, సావిత్రే తన తండ్రికి మద్యాన్ని అలవాటు చేసిందని తెలిపారు.
ప్రేక్షకులు జెమినీ గణేశన్ను అంగీకరించకుంటే ‘కాదల్ మన్నన్’ (ప్రేమరాజు) అనే బిరుదు ఎందుకిస్తారని కమలా సెల్వరాజ్ ప్రశ్నించారు. సావిత్రిని కాపాడింది తన తండ్రే అని పేర్కొన్నారు. ప్రాప్తం చిత్ర నిర్మాణం చేయాలన్న పంతంతో ఉన్న సావిత్రి నిర్ణయాన్ని వెనక్కు తీసుకోమని చెప్పడానికి నాన్నతో కలసి తానూ ఆమె ఇంటికి వెళితే తమపై కుక్కను వదిలి గెంటేశారని, తాము కుక్క బారి నుంచి తప్పించుకోవడానికి గోడ దూకి పారిపోవలసి వచ్చిందన్నారు. ఆ సంఘటన తరువాత నాన్న మళ్లీ సావిత్రి ఇంటికి వెళ్లలేదని కమలా సెల్వరాజ్ చెప్పారు.