రూ.2వేల పెట్టుబడితో ఏకంగా చేతికి రూ.7 లక్షలు
దీర్ఘకాలికంగా పెట్టుబడి పెట్టాలనుకునేవారికి మంచి సాధనం ప్రజా భవిష్యనిధి ఖాతా (పీపీఎఫ్). తక్కువ డబ్బుతో మంచి రాబడి పొందాలని భావించే వారికి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకం అనువుగా ఉంటుంది. ఉత్తమమైన దీర్ఘకాల ఇన్వెస్ట్మెంట్ సాధనాల్లో పీపీఎఫ్ ఒకటి. ఇందులో పన్నురాయితీలను పొందొచ్చు. పెట్టుబడి పెట్టిన డబ్బులు.. వచ్చే వడ్డీ, తీసుకునే డబ్బులు.. ఇలా ప్రతి దానిపై పన్ను మినహాయింపు ఉంటుంది. మీరు మీ కుటుంబ సభ్యుల్లో ఎవరిపేరుమీదైనా పీపీఎఫ్ ఖాతా తెరవొచ్చు. ఇందులో డబ్బులు పెట్టుబడిగా పెట్టడం వల్ల ఎటువంటి రిస్క్ ఉండదు. పూర్తి భద్రత లభిస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో పీపీఎఫ్ ఖాతాలో రూ.1.5 లక్షల వరకు ఎంతైనా డిపాజిట్ చేసుకోవచ్చు. 7.1 శాతం వడ్డీ లభిస్తుంది.
మన ఖాతాకు వడ్డీ జమవుతుంటుంది
ప్రతి ఏడాది మీ వడ్డీ డబ్బులు పీపీఎఫ్ ఖాతాకు జమవుతుంటాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ రేట్లను సమీక్షిస్తుంటుంది. రేట్లను పెంచడం, తగ్గించడం లేదంటే స్థిరంగా కొనసాగించడం చేస్తుంటుంది. పీపీఎఫ్ ఖాతా మూసేయకుండా ఉండాలంటే కనీసం ఏడాదికి రూ.500 డిపాజిట్ చేయాలి. ఉదాహరణకు మీరు మీ భార్య పేరుతో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతా తెరిచి ఏడాదికి రూ.1.5 లక్షలు డిపాజిట్ చేస్తూ వస్తున్నారని అనుకుందాం. ఇలా 15 సంవత్సరాలు పెట్టుబడి పెడితే మీ చేతికి ఏకంగా రూ.40 లక్షలు అందుతాయి. మెచ్యూరిటీ కాలం 15 ఏళ్లు. ఈ మెచ్యూరిటీ కాలాన్ని మనం ఐదేళ్ల చొప్పున పెంచుకుంటూ వెళ్లొచ్చు.
పెట్టుబడికి ఉత్తమ సాధనం
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతా అనేది దీర్ఘకాలిక ఇన్వెస్ట్మెంట్లకు సంబంధించిన ఉత్తమ సాధనమని నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు నెలకు మీరు రూ.2,000 ఇన్వెస్ట్ చేస్తే (ఏడాదికి రూ.24,000) 15 ఏళ్ల తర్వాత మెచ్యూరిటీ మొత్తం కింద రూ.7 లక్షలు అందుకోవచ్చు. మీరు రూ.5,000 ఇన్వెస్ట్ చేస్తూ వెళితే 15 ఏళ్ల తర్వాత రూ.17 లక్షలు పొందొచ్చు. అదే మీరు నెలకు రూ.10,000 ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ సమయంలో ఏకంగా రూ.35 లక్షలు అందుకోవచ్చు.