నిక్ జోనస్-ప్రియాంక చోప్రాల గారాల పట్టి పేరేంటో తెలుసా..?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా గురించి తెలియని వారంటూ ఉండరు. బాలీవుడ్లోపాటు పలు సినీ ఇండస్ట్రీలోనూ హీరోయిన్గా నటించారు. అలాగే హాలీవుడ్ సినిమాల్లోనూ నటించారు. గ్లోబల్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న ప్రియాంక అమెరికన్ యాక్టర్ నిక్ జోనస్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రియాంక చోప్రా-నిక్ జోనస్కు 2018లో వివాహం జరిగింది. వీరు పెళ్లి చేసుకుని దాదాపు మూడేళ్లు దాటింది. అయితే ఇటీవల ప్రియాంక సరోగసి ద్వారా పండంటి బిడ్డను జన్మనిచ్చారు.
ఈ విషయాన్ని ప్రియాంకే స్వయంగా వెల్లడించారు. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో జూనియర్ ప్రియాంక వచ్చేసిందంటూ స్టోరీ పోస్ట్ చేసింది. దీంతో పలువురు సెలబ్రిటీలు, అభిమానులు అభినందనలు తెలిపారు. ఆ తర్వాత బిడ్డకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ ఇప్పటివరకు నిక్ కానీ, ప్రియాంక కానీ షేర్ చేయలేదు. దీంతో నిరాశలో ఉన్న తన అభిమానులకు గుడ్న్యూస్ విన్నట్లు అయింది. తాజాగా ప్రియాంక చోప్రా తమ బిడ్డకు పేరు పెట్టినట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు. ప్రియాంక చోప్రా-నిక్ తమ గారాల పట్టికి.. ‘మాల్తీ మేరీ చోప్రా జోనస్’ అనే పేరు పెట్టారు.
అయితే ఈ పేరుకు పెద్ద అర్థమే ఉందని ప్రియాంక చెప్పుకొచ్చారు. మాల్తీ అంటే సంస్కృత పదమని, దీనికి అర్థం సువాసన గల పువ్వు లేదా చంద్రకాంతి అని ఆమె తెలిపారు. అలాగే మేరీ లాటిన్ స్టెల్లా మారిస్ నుంచి వచ్చిందని అన్నారు. దీని అర్థం సముద్రపు నక్షత్రమని పేర్కొన్నారు. అలాగే జీసస్ తల్లి పేరైన మేరీ పేరు కూడా కలుస్తుందని, అలాగే తన భర్త పేరు, తన పేరు వచ్చేలా తమ గారాల పట్టికి పేరు పెట్టామని ఆమె తెలిపారు. కాగా, కాలిఫోర్నియాలోని శాన్డియాగోలో జనవరి 15వ తేదీన రాత్రి 8 గంటలకు ప్రియాంక-నిక్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. వీరిద్దరికీ పెళ్లి అయిన మరుసటి ఏడాదే అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో స్థిరపడ్డారు. దాదాపు 149 కోట్లు ఖర్చు చేసి విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేశారు.